చమురు పైపైకి.. రూపాయి పాతాళానికి

9 Jun, 2022 16:27 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి ఆల్‌ టైం కనిష్టానికి చేరింది. ఎఫ్‌ఐఐల అమ్మకాలు, ఎగిసిన గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల  నేపథ్యంలో డాలరు మారకంలో  రూపాయి గురువారం 77.81 వద్ద కొత్త కనిష్ట స్థాయిని నమోదు చేసింది. రూపాయి 77.74 వద్ద ప్రారంభమైన రూపాయి ఆపై మరింత పడిపోయింది. బుధవారం  77.68 ముగింపుతో పోలిస్తే 13 పైసలు పతనమైంది. చివరకు 77.78 వద్ద ముగిసింది. 

స్టాక్‌మార్కెట్‌లో విదేశీపెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతున్నాయి. మార్కెట్ డేటా ప్రకారం రూ.2,484.25 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనాలు, ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి పెరగడంతోపాటు భారతీయ షేర్ మార్కెట్‌లో ఎఫ్‌ఐఐలు అమ్మకాల జోరు రూపాయిని మరింత బలహీన పర్చాయని ఫారెక్స్‌ నిపుణులు తెలిపారు. చైనాలో మేలో ఊహించిన దానికంటే ఎక్కువ ఎగుమతులు 16.9 శాతం (సంవత్సరానికి) జంప్  చేయడం, అక్కడ లాక్‌డౌన్ పరిమితులను (షాంఘై ఇప్పటికీ కఠినమైన లాక్‌డౌన్‌) సడలింపు లాంటి పరిణామాల మధ్య  చమురు ధరలు 13 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని రాయిటర్స్ నివేదించింది. చమురు బ్యారెల్‌ ధర 123.43 డాలర్ల వద్దకు చేరింది. కాగా  

ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే లక్ష్యం: ఆర్బీఐ
జూన్ మానిటరీ పాలసీ  రివ్యూలో  50 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ రెపో రేటును 4.9 శాతంగా ఉంచింది. ఏప్రిల్ 2022 నుండి రెపో రేటును పూర్తిగా 90 బేసిస్ పాయింట్లు పెంచడం రెండు నెలల్లో ఇది రెండవ పెంపు. అలాగే రానున్న సెప్టెంబరు రివ్యూలో కూడా వడ్డీ వడ్డింపు తప్పదనే భావన మార్కెట్‌ వర్గాల్లో నెలకొంది. ఆహారం,ఇంధన ధరల కారణంగా, ఏప్రిల్ 2022లో ద్రవ్యోల్బణం 7.79 శాతంగా నమోదైంది.  అయితే   ఇన్‌ఫ్లేషన్‌ను  4 శాతానికి తగ్గించడమే తమ లక్ష్యమని గవర్నర్ శక్తికాంత దాస్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు