డాలర్ల రాకపై రూపాయి భరోసా

31 Aug, 2021 08:16 IST|Sakshi

ముంబై: దేశానికి మరింత భారీగా డాలర్లు వస్తా యన్న భరోసా రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ సోమవారం 40 పైసలు బలపడి 73.29కి చేరింది. గడచిన రెండు నెలల్లో  (జూన్‌ 14 తర్వాత) రూపాయి ఈ స్థాయికి బలోపేతం కావడం ఇదే తొలిసారి.

వడ్డీరేట్లు సమీపకాలంలో పెంచే అవకాశాలు లేవని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ పావెల్‌ సంకేతాలు డాలర్‌ బలహీనతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 73.20 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ప్రాతిపదకన లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌ స్వల్ప నష్టాలతో 92.29 వద్ద ట్రేడవుతోంది.

భారత్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం రూపాయి ముగింపు 73.69. సోమవారం 73.46 వద్ద ప్రారంభమైంది. 73.21 గరిష్ట–73.54 కనిష్ట శ్రేణిలో కదలింది. గడచిన మూడు ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి లాభపడుతూ వస్తోంది. డాలర్‌పై ఈ రోజుల్లో 95 పైసలు లాభపడింది.  రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ).

మరిన్ని వార్తలు