కొనసాగుతున్న రూపాయి పతనం

4 Nov, 2020 11:17 IST|Sakshi

రెండు నెలల కనిష్టానికి దేశీ కరెన్సీ

37 పైసలు డౌన్‌- 74.78కు చేరిన రుపీ

గత వారం సాంకేతికంగా కీలకమైన 74 ఎగువకు క్షీణించిన దేశీ కరెన్సీ మరోసారి డీలాపడింది. ప్రస్తుతం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో 37 పైసలు(0.4 శాతం) కోల్పోయి 74.78ను తాకింది. ఇది రెండు నెలల కనిష్టంకాగా.. మంగళవారం రూపాయి కన్సాలిడేషన్‌ బాటలో ఫ్లాట్‌గా ముగిసింది. దేశీ ఈక్విటీ మార్కెట్‌ హైజంప్‌ చేసినప్పటికీ అక్కడక్కడే అన్నట్లుగా 74.41 వద్ద ముగిసింది. యూఎస్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94 దిగువకు బలపడింది. మరోపక్క అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ అంశాల నేపథ్యంలో ఇటీవల రూపాయి బలహీనపడినట్లు ఫారెక్స్‌ వర్గాలు తెలియజేశాయి. సమీక్షలో భాగంగా ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించే వీలున్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా చర్యలు ప్రకటించవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అభిప్రాయపడింది. రూపాయి సమీప భవిష్యత్‌లో 75.20- 74.20 మధ్య ప్రతికూల ధోరణిలో కదిలే వీలున్నట్లు అంచనా వేసింది.

మరిన్ని వార్తలు