Sachin Tendulkar: ఈ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్‌ చేసిన సచిన్‌..!

31 Jul, 2021 21:27 IST|Sakshi

ముంబై:  భారత క్రికెట్‌ దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్‌  సచిన్‌ టెండూల్కర్‌ మరో సారి డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ కంపెనీ జెట్‌సింథసిస్‌లో భారీగా ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. సుమారు రెండు మిలియన్ల డాలర‍్లను (సుమారు రూ. 14.8 కోట్లు) కంపెనీలో సచిన్‌ టెండూల్కర్‌ ఇన్వెస్ట్‌ చేశారని జెట్‌సింథసిస్‌  ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో కూడా సచిన్‌ ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేశారు. వీరు ఇరువురు కలిసి డిజిటల్‌ క్రికెట్‌ డెస్టినేషన్‌, 100ఎమ్‌బీ, క్రికెట్‌ గేమ్స్‌, సచిన్‌ సాగా క్రికెట్‌ ఛాంపియన్స్‌, సచిన్‌ సాగా వీఆర్‌ వంటి యాప్‌లను లాంచ్‌ చేశారు.

కాగా ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో జెట్‌సింథసిస్‌ షేర్‌ హోల్డర్లు అదార్‌ పూనావాలా, క్రిస్‌ గోపాలక్రిష్ణన్‌ తో సచిన్‌ టెండూల్కర్‌ జత కట్టనున్నారు. అంతేకాకుండా ప్రస్తుత పెట్టుబడితో సచిన్‌ టెండూల్కర్‌, జెట్‌సింథసిస్‌ కంపెనీల మధ్య సంబంధం మరింత బలోపేతం కానుంది. కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్‌పై సచిన్‌ టెండూల్కర్‌ స్పందిస్తూ..జెట్‌ సింథసిస్‌తో తన అనుబంధం ఐదు సంవత్సరాల నాటిదని తెలిపారు. జెట్‌సింథసిస్‌ చేసిన పలు యాప్‌లతో తాను అభిమానులకు మరింత దగ్గరయ్యానని పేర్కొన్నారు. తొలిసారిగా సచిన్‌  క్రికెట్‌ సాగా యాప్‌ను ఈ కంపెనీతో ప్రారంభించగా, అది ప్రస్తుతం సుమారు 20 మిలియన్ల డౌన్‌లోడ్స్‌కు చేరుకుందని తెలిపారు. అత్యంత ప్రజాదరణ కల్గిన గేమ్‌లలో ఇది కూడా ఒక్కటిగా నిలిచిందని వెల్లడించారు.

జెట్‌సింథసిస్‌ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ రాజన్‌ నవని మాట్లాడుతూ.. సచిన్‌ తన అభిమానులతో నేరుగా మాట్లాడేందుకు 100ఎమ్‌బీ ప్లాట్‌ఫాం ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు.  మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌  కంపెనీలో చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌తో జెట్‌సింథసిస్‌ కుటుంబంలో కీలక సభ్యుడుగా చేరడం మాకు చాలా సంతోషనిస్తుందని తెలిపారు. జెట్ సింథసిస్ ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది. ఈ కంపెనీకి భారత్‌తో పాటు జపాన్, యూకే, ఈయూ, యూఎస్‌ దేశాల్లో కార్యాలయాలు కలవు.


 

మరిన్ని వార్తలు