పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు అప్‌..

2 Jun, 2023 04:08 IST|Sakshi

మే అధికారిక గణాంకాల వెల్లడి

పెరిగిన వ్యవసాయ డిమాండ్‌   

వ్యవసాయానికి డిమాండ్‌ పెరగడం, వేసవి ప్రారంభంతో వాహన ఎయిర్‌ కండిషనింగ్‌ అవసరం వంటి అంశాలతో భారత్‌లో మేనెల పెట్రోల్‌ డీజిల్‌ అమ్మకాలు పెరిగాయని  తాజా గణాంకాలు తెలిపాయి. ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

న్యూఢిల్లీ: దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం– డీజిల్‌కు డిమాండ్‌ ( మొత్తం డిమాండ్‌లో ఐదింట రెండు వంతుల వాటా) గత ఏడాది మేతో పోలిస్తే మేలో 9.3 శాతం పెరిగి 7.46 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. ఏప్రిల్‌లో డిమాండ్‌ పెరుగుదల 6.7 శాతం.  
► నెలవారీగా చూస్తే డీజిల్‌ డిమాండ్‌ ఏప్రిల్‌లో 7.16 మిలియన్‌ టన్నులుకాగా, మేలో 4.2 శాతం పెరుగుదలతో 7.46 మిలియన్‌ టన్నులకు చేరింది.  
► ఇక పెట్రోల్‌ అమ్మకాలు వార్షికంగా 10.4 శాతం పురోగతితో 3.08 మిలియన్‌ టన్నులకు చేరింది. నెలవారీగా చూస్తే డిమాండ్‌ 16.5 శాతం పెరిగింది.  
► పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చి ద్వితీయార్థం నుంచి పెట్రోలు, డీజిల్‌ విక్రయాలు పెరిగాయి. మార్చి ప్రథమార్థంలో వార్షిక ప్రాతిపదికన పెట్రోల్‌ విక్రయాలు 1.4 శాతం, డీజిల్‌ 10.2 శాతం తగ్గాయి.
► ఉష్ణోగ్రత పెరుగుదలతో ఎయిర్‌ కండిషనింగ్‌ అవసరాలు పెరగడమూ మేలో వినియోగం పెరగడానికి ఒక కారణం.  
► రబీ పంటలు– ఎక్కువగా గోధుమలు, బార్లీ, ఆవాలు, నువ్వులు, పెసల పంటకాలం  అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య ప్రారంభమవుతుంది. నూర్పిడికాలం ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు ఉంటుంది. హార్వెస్టింగ్, ట్రాక్టర్ల అవసరాలు డీజిల్‌ డిమాండ్‌ పెరుగుదలకు దారితీస్తుంది.
► కోవిడ్‌ సంక్షోభంలో ఉన్న 2021మే నెలతో పోల్చితే పెట్రోల్‌ వినియోగం తాజా సమీక్షా నెల్లో 72 శాతం పెరిగింది. మహమ్మారి ముందు 2019 మే నెలతో పోల్చితే 23.7 శాతం ఎగసింది.  
► మే 2021తో పోల్చితే డీజిల్‌ వినియోగం 52.5 శాతం, మే 2019తో పోల్చితే 6.8 శాతం ఎగశాయి.  

పరిశ్రమ మాట..
ప్రభుత్వ, ప్రైవేట్‌ మూలధన వ్యయం పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంది. సేవల రంగం పటిష్టంగా ఉండగా తయారీ రంగం కూడా పుంజుకుంది. దేశంలో చమురు డిమాండ్‌కు
బలమైన పారిశ్రామిక కార్యకలాపాలు మద్దతునిస్తున్నాయి.  వ్యవసాయ రంగంలో డిమాండ్‌  పుంజుకోవడం ఇంధన డిమాండ్‌కు మద్దతు నిస్తోంది. నీటిపారుదల విభాగంలో పైపుల వినియోగం
ఇంధన డిమాండ్‌కు కారణంగా ఉన్న మరో కీలక అంశం.   

జెట్‌ ఫ్యూయల్‌కు డిమాండ్‌
ఏవియేషన్‌ రంగం నిరంతర సేవల పునఃప్రారంభంతో విమానాశ్రయాలలో భారత్‌ మొత్తం ప్రయాణీకుల రద్దీ కోవిడ్‌ ముందస్తు స్థాయికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో జెట్‌ ఫ్యూయెల్‌ డిమాండ్‌ మే నెల్లో 2022 ఇదే నెల్లో పోల్చితే 8.7 శాతం పెరిగి 6,09,800 టన్నులకు ఎగసింది. 2021 మేతో పోల్చితే 137 శాతం పెరిగింది. అయితే కోవిడ్‌ ముందస్తు విషయానికి వస్తే, 2019 మేనెలతో పోల్చితే 5.3% తక్కువగానే నమోదయ్యింది. అలాగే ఏప్రిల్‌ 2023తో (6,13,900 టన్నులు) పోల్చినా డిమాండ్‌ 0.7% తక్కువగానే ఉంది.  

వంట గ్యాస్‌ అమ్మకాలూ అప్‌
మరోవైపు వంట గ్యాస్‌ ఎల్‌పీజీ అమ్మకాలు వార్షికంగా మేలో 10% పెరిగి 2.4 మిలియన్‌ టన్నులకు చేరింది. ఎల్‌పీజీ వినియోగం 2021 మేతో పోల్చితే 13%, కోవిడ్‌ ముందస్తు కాలం 2019 మేతో పోల్చితే 19.6 % ఎగసింది. నెలవారీ డిమాండ్‌ చూసి నా (2023 ఏప్రిల్‌) మేనెల్లో ఎల్‌పీజీ డిమాండ్‌ 11.3 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో డిమాండ్‌ 2.19  మిలియన్‌ టన్నులు.

మరిన్ని వార్తలు