Samsung Feature Phones News: భారత్‌కు శాంసంగ్‌ భారీ షాక్‌! ఇకపై ఆ ప్రొడక్ట్‌లు ఉండవట!

25 May, 2022 18:47 IST|Sakshi

ప్రముఖ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ భారత్‌కు భారీ షాకిచ్చింది. ఇకపై ఫీచర్‌ ఫోన్‌లను ఇండియాలో అమ్మకూడదని నిర్ణయించింది. అయితే స్మార్ట్‌ ఫోన్‌ సేల్స్‌ను కొనసాగించనుంది.
 

శాంసంగ్‌ ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో దేశీయంగా ప్రీమియం,సూపర్‌ ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ ఎత్తున అమ్మకాలు జరిపింది. అయినా భారత్‌లో ఫీచర్‌ఫోన్‌ అమ్మకూడదనే నిర్ణయం ఇతర ఫోన్‌ తయారీ సంస్థల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కారణం ఏదైనా ఇకపై భారత్‌లో శాంసంగ్‌కు చెందిన ఫీచర్‌ ఫోన్‌లు కనుమరుగు కానున్నాయి. 

రూ.15వేల లోపు ఫోన్‌లే 
సౌత్‌ కొరియా దిగ్గజం ఫీచర్‌ ఫోన్‌ అమ్మకాలు వద్దనుకున్నా..బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్‌లను అమ్మనుంది. ఇందుకోసం శాంసంగ్‌ మరో రెండు సంస్థలతో సహకారంతో పీఎల్‌ఐ స్కీం కింద రూ.15వేల లోపు ఉన్న ఫోన్‌లను తయారు చేయనుంది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.10వేల నుంచి రూ.20 వేల మధ్య ఉన్న ఫోన్‌ల డిమాండ్‌ పెరగనుంది.   

షిప్‌మెంట్‌ తగ్గింది
ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో భారత్‌లో శాంసంగ్‌ ఫీచర్‌ ఫోన్‌ షిప్‌మెంట్‌ తగ్గి 39 శాతంతో సరిపెట్టుకుంది. సప్లయ్‌ చైన్‌ సమస్యలు, అధిక రిటైల్ ద్రవ్యోల్బణం కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఫీచర్‌ ఫోన్‌ షిప్‌ మెంట్‌లో ప్రథమ స్థానంలో ఉన్న శాంసంగ్‌ కేవలం 12శాతంతో  మూడో స్థానానికి పడిపోయింది.  

శాంసంగ్‌ సరికొత్త రికార్డ్‌లు 
భారత స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో శాంసంగ్‌ సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో శాంసంగ్‌ సత్తా చాటింది. ఆ సంస్థ దేశీయంగా విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ గెలాక్సీ ఎస్‌ 22 సిరీస్‌ ఫోన్‌ అమ్మకాలతో నెంబర్‌ వన్‌ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థగా పేరు సంపాదించింది. సూపర్‌ ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లు సైతం 81శాతం అమ్మకాలతో యూజర్లను ఆకట్టుకున్నాయి.  
    
ప్రీమియం టూ సూపర్‌ ప్రీమియం
ప్రీమియం సెగ్మెంట్‌లో అంటే ధర రూ.30వేలకు పైగా ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లు 38శాతంతో అమ్ముడుపోయాయి. మార్చిలో  ధర లక్షకు పైగా ఉన్న గెలాక్సీ ఎస్‌ 22 ఆల్ట్రా సూపర్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో 81శాతంతో అమ్మకాలు జరిపినట్లు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ సంస్థ తెలిపింది. 

చదవండి👉గుడ్‌న్యూస్‌: అదిరిపోయే డిస్కౌంట్‌లు, ఐఫోన్‌ 13పై బంపరాఫర్లు!

మరిన్ని వార్తలు