చైనాకు షాక్ ‌: వేలకోట్ల పెట్టుబడులు ఇండియాకు

12 Dec, 2020 10:51 IST|Sakshi

పీఎల్‌ఐ పథకం కింద శాంసంగ్‌కు  ప్రోత్సాహకాలు

చైనా తయారీ యూనిట్‌   యూపీకి తరలింపు

లక్నో: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారతదేశంలో భారీ పెట్టుబడిని పెట్టనుంది. ముఖ్యంగా మొబైల్, ఐటీ డిస్‌ప్లే ప్రొడక్షన్ యూనిట్‌ను చైనా నుంచి ఇండియాకు తరలించనుంది. ఉత్తరప్రదేశ్‌లో నోయిడాలో భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో దేశంలోనే శాంసంగ్‌కు చెందిన తొలి హై-టెక్నిక్ ప్రాజెక్ట్‌గా ఇది అవతరించనుంది. అంతేకాదు ప్రపంచంలో ఇలాంటి అధునాతన యూనిట్‌ ఉన్న మూడవ దేశంగా  భారత్‌ నిలవనుంది.

యూపీ ముఖ‍్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ‘శాంసంగ్‌ డిస్‌ప్లే నోయిడా ప్రైవేట్ లిమిటెడ్‌’కు ప్రత్యేక ప్రోత్సాహకాలను శుక్రవారం ఆమోదించింది. 'యూపీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ 2017' ప్రకారం భూమిని బదిలీ చేయడంలో శాంసంగ్‌కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు లభించనుంది. అలాగే తయారీ ఎలక్ట్రానిక్ భాగాలు, సెమీ కండక్టర్ల ప్రమోషన్ కోసం భారత ప్రభుత్వ పథకం కింద ఇది 460 కోట్ల రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందుకుంటుంది. దీంతో శాంసంగ్‌  రూ .4,825 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా 510 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ సంస్థకు ఇప్పటికే నోయిడాలో మొబైల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దీనిని 2018 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక పథకం(పీఎల్‌ఐ)కింద ఆపిల్ పార్టనర్స్‌ ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్, పెగాట్రాన్ కంపెనీలకు భారత ప్రభుత్వ గ్రీన్‌ సిగ్నల్‌ లభించిన అనంతరం తాజాగా శాంసంగ్‌ అనుమతి లభించింది. ఈ కంపెనీలు రూ.15 వేల లోపు ధరతో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి  చేయనున్నారు. తద్వారా సుమారు 40 బిలియన్ల విలువైన హ్యాండ్‌సెట్‌లను ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం.

మరిన్ని వార్తలు