శామ్‌సంగ్‌ గ్రూప్ భారీ పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు

24 Aug, 2021 21:17 IST|Sakshi

దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శామ్‌సంగ్ గ్రూప్ తన సెమీకండక్టర్, బయోఫార్మాస్యూటికల్స్, టెలికమ్యూనికేషన్స్ యూనిట్లలో 205 బిలియన్ డాలర్లు(సుమారు రూ.15 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాబోయే మూడు ఏళ్లలో 40,000 మందికి ఉపాది కల్పించనున్నట్లు శామ్‌సంగ్‌ తెలిపింది. "ప్రత్యక్ష ఉపాధిని పెంచడం, విద్యా అవకాశాలను అందించడం, యువత సృజనాత్మక సామర్థ్యాలు వ్యాపారాలు & సమాజానికి ఎక్కువ దోహదపడేలా చూడటానికి స్టార్ట్-అప్ లకు మద్దతు ఇవ్వడమే ఈ ప్రణాళిక ఉద్దేశ్యం" అని అధికారిక ప్రకటనలో తెలిపింది.

శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్, శామ్‌సంగ్‌ బయోలాజిక్స్ వంటి ప్రధాన అనుబంధ సంస్థలు టెలికమ్యూనికేషన్స్, రోబోటిక్స్, ఏఐ వంటి రంగాలలో పరిశోధనలను & ఖర్చులను చూస్తాయి. దక్షిణ కొరియా కేంద్రంగా సెమీకండక్టర్ల తయారీపై దృష్టి సారించడానికి 2030 నాటికి $151 బిలియన్లను పెట్టుబడి పెట్టాలనే శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్ దీర్ఘకాలిక లక్ష్యం. దేశీయ ఎస్ఎంఈల తయారీ సామర్థ్యాలను అప్ గ్రేడ్ చేసే లక్ష్యంతో శామ్‌సంగ్‌ తన 'స్మార్ట్ ఫ్యాక్టరీ ప్రోగ్రామ్'ను కూడా ప్రారంభించింది.

ఇక మన దేశవ్యాప్తంగా సీఎస్ఆర్ కింద ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ రంగానికి అవసరమైన మానవ వనరులను అందించేందుకు నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్(ఎన్‌ఎస్‌డీసీ)తో చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఎస్‌డీసీ 120 కేంద్రాల్లో శామ్‌సంగ్‌ దోస్త్‌(డిజిటల్, ఆఫ్‌లైన్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌) ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ఇందులో భాగంగా 50,000 మంది యువతకు శామ్‌సంగ్‌ శిక్షణ ఇవ్వనుంది. (చదవండి: మస్తు ఫీచర్లతో మడత ఫోన్లు.. ఇరగదీస్తున్నాయిగా)

మరిన్ని వార్తలు