సారేగామా... డివిడెండ్‌ రూ. 30

20 Jan, 2022 02:41 IST|Sakshi

మ్యూజిక్‌ లేబుల్‌ కంపెనీ సారేగామా ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 38 శాతం ఎగసి దాదాపు రూ. 44 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 32 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ. 150 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. కాగా.. క్యూ3లో మొత్తం వ్యయాలు 5 శాతం పెరిగి రూ. 100 కోట్లను దాటాయి.

మ్యూజిక్‌ విభాగం ఆదాయం రూ. 133 కోట్లుకాగా.. ఫిల్మ్‌లు, టీవీ సీరియల్స్‌ నుంచి దాదాపు రూ. 16 కోట్లు లభించింది. ఈ కాలంలో కరణ్‌ జోహార్‌ రాఖీ రాణీకి ప్రేమ్‌ కహానీ మ్యూజిక్‌ హక్కులను సొంతం చేసుకుంది. విభిన్న భాషలలో 165 సినిమా పాటలను విడుదల చేసింది. షార్ట్‌ వీడియో యాప్‌ చింగారీతో గ్లోబల్‌ మ్యూజిక్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెస్లే, అమెజాన్, ఫోన్‌పే తదితర దిగ్గజాలు తమ బ్రాండ్‌ ప్రకటనలకు కంపెనీ పాటలను వినియోగించుకుంటున్నట్లు సారేగామా తాజాగా పేర్కొంది.
ఫలితాల నేపథ్యంలో సారేగామా షేరు బీఎస్‌ఈలో 1.3 శాతం నష్టంతో రూ. 5,267 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు