SBI: ఎస్​బీఐ ఖాతాదారులకు మరో గుడ్​న్యూస్

4 May, 2021 14:49 IST|Sakshi

ముంబై: ఎస్​బీఐ తన ఖాతాదారులకు మరో గుడ్​న్యూస్ అందించింది. కొద్దీ రోజుల క్రితమే గృహ రుణాలపై అందించే వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో తమ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేవైసీ అప్​డేట్ కోసం పత్రాలను మెయిల్ లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు అని భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) నిర్ణయించింది.

ఏప్రిల్ 30 నాటికి దేశంలో ఉన్న మొత్తం 17 స్థానిక ప్రధాన కార్యాలయాల చీఫ్ జనరల్ మేనేజర్‌కు ఇచ్చిన సమాచారంలో కస్టమర్ మెయిల్ లేదా పోస్ట్ ద్వారా కెవైసి అప్‌డేట్ చేసిన అభ్యర్థనలను అంగీకరించాలని సూచించారు. ఈ చర్యను ఇతర ప్రభుత్వ రంగ రుణదాతలు అనుసరిస్తారని భావిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లోని విధించిన కోవిడ్ -19 లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులు పోస్ట్ ద్వారా స్వీకరించిన పత్రాల ఆధారంగా శాఖలు కేవైసీ నవీకరణను నిర్వహించగలవని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేవైసీ నవీకరణ కోసం కస్టమర్‌ను వ్యక్తిగతంగా బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదు. "అంతేకాక కేవైసీ అప్​డేట్ గడువును మే 31 వరకు పొడిగిస్తున్నాం” అని ఎస్​బీఐ ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

చదవండి:

గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించిన ఎస్​బీఐ

మరిన్ని వార్తలు