ఎస్‌బీఐ కార్డ్‌ లాభం జూమ్‌

29 Oct, 2022 07:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఎస్‌బీఐ కార్డ్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 526 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 345 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 28 శాతం ఎగసి రూ. 3,453 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 2,695 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ప్రమోట్‌ చేసిన క్రెడిట్‌ కార్డుల కంపెనీ వడ్డీ ఆదాయం 27 శాతం పురోగమించి రూ. 1,484 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.36 శాతం నుంచి 2.14 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.91 శాతం నుంచి 0.78 శాతానికి నీరసించాయి. కనీస మూలధన నిష్పత్తి 23.2 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5.5 శాతం పతనమై రూ. 812 వద్ద ముగిసింది.

చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్‌ లెటర్స్‌ లేవు.. అన్నింటికీ అదే కారణమా

మరిన్ని వార్తలు