ఎస్‌బీఐ కార్డ్‌ లాభం జూమ్‌

25 Jan, 2022 03:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 84 శాతం జంప్‌ చేసి రూ. 386 కోట్లను తాకింది. ఇందుకు కార్డుల వినియోగం పుంజుకోవడం, మొండి రుణాలు తగ్గడం, ఇతర ఆదాయం పెరగడం వంటి అంశాలు సహకరించాయి. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 210 కోట్లు మాత్రమే ఆర్జించింది.

కాగా.. మొత్తం ఆదాయం 24 శాతం ఎగసి రూ. 3,140 కోట్లకు చేరింది. ప్రస్తుత సమీక్షా కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.51 శాతం నుంచి 2.40 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు సైతం 1.60 శాతం నుంచి 0.83 శాతానికి నీరసించాయి. అయితే ఫైనాన్స్‌ వ్యయాలు 6 శాతం అధికమై రూ. 277 కోట్లను తాకాయి. మొత్తం నిర్వహణ వ్యయాలు 28 శాతం పెరిగి రూ. 1,719 కోట్లకు చేరాయి.
ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్‌ షేరు బీఎస్‌ఈలో 4.3 శాతం పతనమై రూ. 814 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు