ఎస్‌బీఐ కార్డ్, పేటీఎం జోడీ

31 Dec, 2021 07:43 IST|Sakshi

కార్డ్‌ టోకెనైజేషన్‌పై కలిసి పని చేయాలని నిర్ణయం

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కార్డ్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్, పేటీఎంతో చేతులు కలిపింది. కార్డుదారులు తమ కార్డును చెల్లింపుల పరికరాలపై టోకెనైజ్‌ చేసుకునేందుకు, పేటీఎం ద్వారా చెల్లింపులు చేసేందుకు భాగస్వామ్యం తోడ్పడుతుందని ఎస్‌బీఐ కార్డ్‌ వెల్లడించింది. టోకెనైజేషన్‌ అంటే.. అసలు కార్డు నంబర్‌ కనిపించకుండా, దాని స్థానంలో వినూత్నమైన అక్షరాలకు చోటు కల్పిస్తారు. దీంతో కార్డు దారుల అసలు డేటా దుర్వినియోగానికి అవకాశం ఉండదు. ఆండ్రాయిడ్‌ ఆధారిత ఎన్‌ఎఫ్‌సీ (నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ సదుపాయం ఉన్న) పరికరాలపైనే కార్డు టోకెనైజేషన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ కార్డ్‌ తెలిపింది.

‘‘ప్రస్తుతానికి భారత్‌ పరిధిలో జారీ చేసే కార్డులే పేటీఎం నెట్‌వర్క్‌పై పనిచేస్తున్నాయి. అయినప్పటికీ కస్టమర్లు వారి ఎస్‌బీఐ కార్డ్‌ను అంతర్జాతీయంగా ఇతర ప్రాంతాల్లోని పేటీఎం నెట్‌వర్క్‌పైనా వినియోగించుకోవచ్చు’’ అని ఎస్‌బీఐ కార్డ్‌ సూచించింది.  
 

మరిన్ని వార్తలు