ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త!

14 Sep, 2021 21:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ తన ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బేస్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05 శాతం తగ్గించాలని ఎస్‌బీఐ 14 సెప్టెంబర్ 2021న నిర్ణయించింది. దీని తర్వాత కొత్త వడ్డీ రేట్లు 7.45 శాతంగా ఉంటాయి. అదే సమయంలో ప్రైమ్ రుణ రేటు(పీఎల్ఆర్)ను కూడా 12.20 శాతానికి(5 బేసిస్ పాయింట్లు తగ్గించి) తగ్గిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ కొత్త రేట్లు 15 సెప్టెంబర్ 2021 నుంచి అమలులోకి రానున్నాయి.

గతంలో ఏప్రిల్ 2021లో ఎస్‌బీఐ గృహ రుణాల రేట్లను 6.70 శాతానికి, మహిళా రుణగ్రహీతలకు ప్రత్యేక రాయితీ కింద 5 బీపీఎస్ తగ్గించింది. బేస్ రేటు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత ప్రభావితం చెందుతాయి. సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించిన బేస్ రేటు కంటే తక్కువ రేటుతో రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అనుమతి లేదు. సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించిన ప్రస్తుత బేస్ రేటు 7.30-8.80 శాతంగా ఉంది. ఎస్‌బీఐ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుడి జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ కొత్త వడ్డీరేట్ల వల్ల ఎస్‌బీఐ కస్టమర్లు ప్రతి నెల చెల్లించే గృహ రుణం, ఆటో రుణం, వ్యక్తిగత రుణంతో సహా వివిధ రకాల రుణాల వాయిదాలు తక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.(చదవండి: ఎం‌ఐ ప్రియులకి షియోమీ షాకింగ్ న్యూస్)

మరిన్ని వార్తలు