ఐదు సెకన్లలో 20 లక్షల ఎస్‌బీఐ పర్సనల్ లోన్ 

17 Feb, 2021 17:19 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఇక నుంచి లోన్ కోసం బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా ఎస్‌బీఐ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ కింద కేవలం 5 సెకన్లలో 20లక్షల రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ లోన్ కోసం వినియోగదారులు మిస్డ్ కాల్ లేదంటే ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. దీనితో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. పెళ్లి, ఎమర్జెన్సీ, ఏదైనా ప్రొడక్టుల కొనుగోలు వంటి వాటికీ త్వరితగతిన రుణం లభిస్తుంది. ఈ విషయాన్నీ ఎస్‌బీఐ తన ట్విటర్ ద్వారా పేర్కొంది. 

తక్కువ డాక్యుమెంటేషన్‌తో వినియోగదారులు వెంటనే లోన్ పొందడానికి ఈ సేవలను ప్రారంభించినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఈ ఎస్‌బీఐ వ్యక్తిగత రుణలపై వడ్డీ రేటు 9.60 శాతంగా ఉంటుంది. ఇది అన్ని భారతీయ బ్యాంకులతో పోలిస్తే చాలా తక్కువ. ఎస్‌బీఐ శాలరీ అకౌంట్ గల ఖాతాదారుడు మొదట ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ సర్వీసు ద్వారా పొందగలిగే ఎస్‌బీఐ రుణ మొత్తం రూ.25 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. వినియోగదారుడు మొదటి రుణ ఈఎంఐలను సకాలంలో చెల్లించినట్లయితే తర్వాత రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ రుణాలను పొందవచ్చు. ఆసక్తికర  విషయం ఏమిటంటే ఈ ఎస్‌బీఐ వ్యక్తిగత రుణం ఎటువంటి హామీ లేదా భద్రత లేకుండా ఇవ్వబడుతుంది. పూర్తీ వివరాల కోసం ఈ లింకు క్లిక్ చేయండి.

ఈ లోన్ పొందాలంటే కచ్చితంగా వినియోగదారుడు ఎస్‌బీఐ శాలరీ అకౌంట్ కలిగి ఉండటంతో పాటు కనీస నెలవారీ ఆదాయం రూ.15వేలు ఉండాలి. ఈ ఎస్‌బీఐ రుణాన్ని పొందాలని భావించే వారు PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తే సరిపోతుంది. లేదంటే 7208933142 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మీకు రుణం లభిస్తుంది. అయితే రుణ గ్రహీత రుణ అర్హత ప్రాతిపదికనే రుణ మంజూరీ ఉంటుంది. మీరు తీసుకునే రుణమొత్తాన్ని బట్టి వడ్డీ రేటు కూడా 9.60 శాతం నుంచి నిర్ణయించబడుతుంది.

చదవండి:

మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్

రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్‌కాయిన్

మరిన్ని వార్తలు