క్యూ4లో రూ. 9,114 కోట్లు
పూర్తి ఏడాదికి 55 శాతం అప్
షేరుకు రూ. 7.10 డివిడెండ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగ ప్రభుత్వ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో స్టాండెలోన్ నికర లాభం 41 శాతం జంప్చేసి రూ. 9,114 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 6,451 కోట్లు ఆర్జించింది. వడ్డీ ఆదాయంలో వృద్ధి, మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. నికర వడ్డీ ఆదాయం 15 శాతం పుంజుకుని రూ. 31,198 కోట్లయ్యింది. అంతక్రితం క్యూ4లో రూ. 27,067 కోట్ల వడ్డీ ఆదాయం ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 82,613 కోట్లకు చేరింది. ఇక క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 56 శాతం దూసుకెళ్లి రూ. 9,549 కోట్లను తాకింది. ఒక్కో షేరుకు రూ. 7.10 చొప్పున డివిడెండును ప్రకటించింది.
ఎన్పీఏలు తగ్గాయ్...
క్యూ4లో ఎస్బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.98 శాతం నుంచి 3.97 శాతానికి ఉపశమించాయి. ఈ బాటలో నికర ఎన్పీఏలు 1.5% నుంచి 1.02%కి తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.29 శాతం బలపడి 3.4 శాతానికి చేరాయి. క్యూ4లో మొండిరుణాలకు కేటాయింపు లు రూ. 9,914 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 3,262 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం ప్రొవిజన్లు 20 శాతం తగ్గి రూ. 10,603 కోట్లకు చేరాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 55 శాతం ఎగసి రూ. 31,676 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 20,410 కోట్లు మాత్రమే ఆర్జించింది.