ఈ స్కీమ్ గడువు పొడగించిన ఎస్‌బీఐ

30 Mar, 2021 20:29 IST|Sakshi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. వృద్ధులకు కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ 'ఎస్‌బీఐ వీకేర్' రిటైల్ టర్మ్ డిపాజిట్ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధుల కోసం ప్రత్యేకంగా టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను 2020 మేలో ఎస్‌బీఐ తీసుకొచ్చింది. మొదట సెప్టెంబర్ వరకు విధించిన గడువును డిసెంబర్ వరకు ఓసారి, 2021 మార్చి 31 వరకు మరోసారి పొడిగించింది. ఈ గడువు ముగుస్తుండటంతో మరోసారి మూడు నెలలు గడువు పొడిగించింది. 

కాబట్టి సీనియర్ సిటిజన్లు 'ఎస్‌బీఐ వీకేర్' స్కీమ్‌లో డిపాజిట్ చేయడానికి మరో మూడు నెలలు సమయం ఉంది. 'ఎస్‌బీఐ వీకేర్' అనేది ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌. సాధారణంగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు వృద్ధులకు వేరుగా ఉంటాయి. దీనిలో చేరితే సాధారణ వడ్డీ రేట్ల కన్నా వృద్ధులకు 80 బేసిస్ పాయింట్స్ అంటే 0.8 శాతం వడ్డీ ఎక్కువ లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ ప్రజలు ఐదేళ్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ‌చేస్తే 5.40 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల కాలానికి డిపాజిట్ మొత్తంపై 6.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.  

'ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌‌లో చేరాలంటే వయస్సు 60 ఏళ్ల పైనే ఉండాలి. భార్యాభర్తలు సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నామినేషన్ సదుపాయం కూడా ఉంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.15,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. మొదట ఐదేళ్లకు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఐదేళ్ల కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేస్తే  0.30 శాతం వడ్డీ నష్టపోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీపై ఎలాంటి ఆదాయపు పన్ను మినహాయింపులు ఉండవు.

చదవండి:

శాశ్వ‌తంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్...!

ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు

మరిన్ని వార్తలు