7 బిజినెస్‌ గ్రూప్‌ల ఆస్తుల వేలం: సెబీ

2 Jun, 2023 04:21 IST|Sakshi

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏడు బిజినెస్‌ గ్రూప్‌లకు చెందిన 17 ఆస్తులను వేలం వేయనున్నట్లు తాజాగా పేర్కొంది. జాబితాలో ఎంపీఎస్, వైబ్‌గ్యోర్‌ గ్రూప్‌లతోపాటు, టవర్‌ ఇన్ఫోటెక్‌ తదితరాలున్నాయి. ఇన్వెస్టర్ల సొమ్ము రికవరీ నిమిత్తం ఈ నెల 28న వేలం నిర్వహించనున్నట్లు సెబీ వెల్లడించింది. ఇందుకు రూ. 51 కోట్ల రిజర్వ్‌ ధరను నిర్ణయించింది. ఇతర గ్రూప్‌లలో ప్రయాగ్, మల్టీపర్పస్‌ బియోస్‌ ఇండియా, వారిస్‌ ఫైనాన్స్‌ ఇంటర్నేషనల్, పైలాన్‌ గ్రూప్‌లున్నట్లు సెబీ ప్రకటించింది.

వీటికి సంబంధించిన ప్రాపర్టీలను బ్లాక్‌ చేస్తున్నట్లు నోటీసు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో విస్తరించిన ఈ ఆస్తులలో భూములు, పలు అంతస్తుల భవంతులు, ఫ్లాట్లు, వాణిజ్య కార్యాలయాలున్నట్లు తెలియజేసింది. ఆన్‌లైన్‌ మార్గంలో నిర్వహించనున్న ఆస్తుల వేలానికి క్విక్‌ఆర్‌ రియల్టీ విక్రయ సేవలందించనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థలన్నీ నిబంధనలు పాటించకుండా ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణ చేపట్టినట్లు సెబీ వివరించింది.

మరిన్ని వార్తలు