న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు ఫార్చూన్ బ్రాండ్ వంట నూనెల కంపెనీ అదానీ విల్మర్ పెట్టుకున్న దరఖాస్తును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పక్కనపెట్టింది. దీంతో ఐపీవో ద్వారా రూ. 4,500 కోట్లను సమీకరించాలని భావించిన కంపెనీకి ప్రస్తుతం చెక్ పడింది. ఈ అంశంపై సెబీ ఎలాంటి స్పష్టతనూ ఇవ్వకపోవడం గమనార్హం! అదానీ విల్మర్ ఈ నెల 3న సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. కాగా.. దరఖాస్తును పక్కనపెట్టిన విషయంపై సెబీ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని అదానీ గ్రూప్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సెబీ నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. భవిష్యత్లోనూ నిబంధనలకు అనుగుణంగా అన్నివిధాలా స్పందించనున్నట్లు వివరించారు.