నామినీ అప్‌డేట్‌ గడువు పొడిగింపు: సెబీ

29 Mar, 2023 06:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత డీమ్యాట్‌ ఖాతాదారులు, మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) ఇన్వెస్టర్లకు నామినీ వివరాలు అప్‌డేట్‌ చేయడం లేదా తొలగించేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గడువును ఆరు నెలలు పొడిగించింది. ప్రస్తుత గడువు మార్చి 31తో ముగియనుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వరకూ అనుమతిస్తూ తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది. 2021 జూలైలో తొలుత అర్హతగల ట్రేడింగ్, డీమ్యాట్‌ ఖాతాదారులంతా 2022 మార్చి31లోగా నామినీ వివరాలు దాఖలు చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. ఇలా చేయని ఖాతాలను డెబిట్‌లు చేపట్టేందుకు వీలులేకుండా నిలిపివేయనున్నట్లు తెలియజేసింది.

తదుపరి 2023 మార్చి31లోగా డీమ్యాట్‌ ఖాతాలు, ఎంఎఫ్‌ ఫోలియోలకు నామినీ వివరాలు జత చేయడం తప్పనిసరి చేసింది. వెరసి నామినీ వివరాలు అందించడం లేదా నామినేషన్‌ను ఉపసంహరించేందుకు మరో ఆరు నెలల గడువు లభించింది. 2022 ఆగస్ట్‌1లోగాఎంఎఫ్‌ సబ్‌స్క్రయిబర్లకు నామినీ వివరాలివ్వడం లేదా నామినేషన్‌ నుంచి తప్పుకునేందుకు 2022 జూన్‌లో సెబీ తప్పనిసరి చేసింది. ఆపై 2022 అక్టోబర్‌ 1వరకూ గడువు పెంచింది. తదుపరి 2023 మార్చి31వరకూ మరోసారి గడువు పొడిగించింది. 2021 అక్టోబర్‌ తదుపరి డీమ్యాట్‌ ఖాతాలు తెరిచే ఇన్వెస్టర్లకు డిక్లరేషన్‌ ఫామ్‌ ద్వారా నామినీ వివరాలిచ్చేందుకు వీలు కల్పించింది. ఇదేవిధంగా నామినేషన్‌ను తప్పించేందుకూ వీలుంది.

మరిన్ని వార్తలు