టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌కు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

8 Sep, 2021 07:54 IST|Sakshi

స్టాక్‌ ఎక్సే్ంజీలకు సెబీ అనుమతుల జారీ 

లావాదేవీల సెటిల్‌మెంట్‌లో పెరగున్న స్పీడ్‌  

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐచ్ఛిక(ఆప్షనల్‌) విధానంలో టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌కు అనుమతించింది. దీంతో మార్కెట్లలో లిక్విడిటీ మెరుగుపడేందుకు వీలుంటుంది. ప్రస్తుతం దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో టీప్లస్‌2 సెటిల్‌మెంట్‌ అమలవుతోంది. అంటే లావాదేవీ నిర్వహించిన రెండు రోజుల తదుపరి సెటిల్‌మెంట్‌ ఉంటోంది. తాజా విధానాన్ని ఎంచుకుంటే లావాదేవీ చేప ట్టాక ఒక రోజు తదుపరి సెటిల్‌మెంట్‌కు వీలుంటుంది. అయితే టీప్లస్‌2 లేదా టీప్లస్‌1 విధానాలు రెండింటినీ సెబీ అనుమతించింది. దీంతో స్టాక్‌ ఎక్సే్ఛంజీలు ఐచ్ఛికంగా వీటిని ఎంపిక చేసుకునేం దుకు వీలుంటుంది. ఇందుకు వీలుగా ఆప్షనల్‌గా టీప్లస్‌1 విధానాన్ని ప్రవేశపెడుతూ సెబీ తాజాగా సర్క్యులర్‌ను జారీ చేసింది. తాజా మార్గదర్శకాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 
నెల రోజుల ముందుగా.. 
సెబీ తాజా నిబంధనల ప్రకారం కనీసం నెల రోజుల ముందుగా నోటీసు ఇవ్వడం ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలు ఎంపిక చేసుకున్న ఏ కౌంటర్‌(కంపెనీ)లోనైనా టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌ను చేపట్టవచ్చు. అయితే ఏ కౌంటర్లోనైనా టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌ను ఎంచుకుంటే కనీసం ఆరు నెలలపాటు తప్పనిసరిగా ఈ విధానాన్ని అమలు చేయవలసి ఉంటుంది. తిరిగి టీప్లస్‌2 సెటిల్‌మెంట్‌లోకి మార్పు చేయాలనుకుంటే యథావిధిగా నెల రోజుల ముందుగా వెబ్‌సైట్‌ లేదా పబ్లిక్‌కు తెలిసేలా నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. స్టాక్‌ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు, డిపాజిటరీలు తదితర మార్కెట్‌ మౌలిక సదుపాయాల సంస్థల నుంచి అందిన సూచనలు, చర్చల తదుపరి తాజా సెటిల్‌మెంట్‌ను సెబీ ప్రవేశపెట్టింది. ఇందుకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవలసిందిగా స్టాక్‌ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు, డిపాజిటరీలకు సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇంతక్రితం 2003లో సెబీ టీప్లస్‌3 సెటిల్‌మెంట్‌ను టీప్లస్‌2కు సవరించింది.
చదవండి: గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ

మరిన్ని వార్తలు