-

కనీస ప్రైస్‌బ్యాండ్‌పై సెబీ ప్రతిపాదన

5 Oct, 2021 08:05 IST|Sakshi

సబ్‌కేటగిరీలోకి సంస్థాగతేతర ఇన్వెస్టర్లు

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుక్‌బిల్ట్‌ విధానంలో పబ్లిక్‌ ఇష్యూలకు కనీసం 5 శాతం ప్రైస్‌బ్యాండ్‌(ధరల శ్రేణి)ను ప్రతిపాదించింది. అంతేకాకుండా నాన్‌ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల(ఎన్‌ఐఐలు)ను సబ్‌కేటగిరీలోకి చేర్చే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ఈ అంశాలతోపాటు బుక్‌ బిల్డింగ్‌ మార్గదర్శకాలపై ప్రతిపాదనలు, వ్యాఖ్యానాలను ఆహ్వానించింది. 2021 అక్టోబర్‌ 20కల్లా వీటిని దాఖలు చేయవలసిందిగా సూచించింది. ఇటీవల పలు కంపెనీలు ఐపీవోల ధరల శ్రేణిలో కనిష్ట, గరిష్టాలను అతితక్కువగా నిర్ణయిస్తున్న నేపథ్యంలో సెబీ తాజా ప్రతిపాదనలు తీసుకువచ్చింది. పలు అంశాలలో ప్రైమరీ మార్కెట్‌ సలహా కమిటీ పలు అభ్యంతరాలను లేవనెత్తినట్లు తెలుస్తోంది. ధరల నిర్ణయంలో పారదర్శక, నిజాయితీ విధానాల అమలు కనుమరుగవుతున్నట్లు అభిప్రాయపడినట్లు సెబీ పేర్కొంది. దీంతో బుక్‌ బిల్ట్‌ విధానంలో కనీసం 5 శాతం ప్రైస్‌బ్యాండ్‌ వ్యత్యాసాన్ని ప్రతిపాదించింది.  
ఎన్‌ఐఐలు ఇలా.. 
ఎన్‌ఐఐల విభాగంలో కొన్ని అతిపెద్ద సంస్థల నుంచే భారీ అప్లికేషన్లు దాఖలుకావడం ద్వారా రిస్కులు ఎదురవుతున్నట్లు సెబీ పేర్కొంది. 2018 జనవరి– 2021 ఏప్రిల్‌ మధ్య కాలంలో అత్యధిక స్పందన లభించిన ఐపీవోలను సెబీ విశ్లేషించింది. 29 పబ్లిక్‌ ఇష్యూలలో సగటున 60 శాతం ఎన్‌ఐఐలకు షేర్ల కేటాయింపు జరగనట్లు గుర్తించింది. ఏ ఐపీవోలోనైనా అందరికీ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నట్లు సెబీ తెలియజేసింది. దీంతో రిటైల్, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్‌ స్థాయిలో సమాన కేటాయింపులవైపు దృష్టిసారించినట్లు వెల్లడించింది. వెరసి ఎన్‌ఐఐలను రెండు కేటగిరీలుగా విభజించేందుకు ప్రతిపాదించింది. తొలి విభాగంలో రూ. 2–10 లక్షల మధ్య ఎన్‌ఐఐలకు మూడోవంతు కేటాయింపు ఉంటుంది. రెండో కేటగిరీలో రూ. 10 లక్షలకుపైన మూడోవంతు షేర్లకు వీలుంటుంది.
 

చదవండి : కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్‌.. సెబీ సీరియస్‌

మరిన్ని వార్తలు