ఫండ్స్‌పై ఆటోమేషన్‌ నిఘా

11 Feb, 2021 05:10 IST|Sakshi

దీంతో వేగంగా ఉల్లంఘనల గుర్తింపు

సెబీ చీఫ్‌ అజయ్‌త్యాగి

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించిన తనిఖీ, నిఘా వ్యవహారాల కోసం ఆటోమేషన్‌ ప్రాజెక్టును అమలు చేయనుంది. దీనివల్ల నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడంలో జాప్యాన్ని నివారించొచ్చని సెబీ చీఫ్‌ అజయ్‌త్యాగి అభిప్రాయపడ్డారు. నిఘా, దర్యాప్తు బాధ్యతలకు సంబంధించి భారీ సాంకేతిక టెక్నాలజీని అమలు చేయబోతున్నట్టు 2019–20 వార్షిక నివేదికలో పేర్కొన్నారు. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ విషయంలోనూ నియంత్రణపరమైన కార్యాచరణ పటిష్టానికి పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అవసరమైతే మరిన్ని సంస్కరణలకు సిద్ధంగా ఉన్నట్టు త్యాగి చెప్పారు.

సమస్యలు నిజమే: ఎన్‌పీసీఐ
నూతన వ్యవస్థ అమలు కారణంగా ఇన్వెస్టర్లు పెట్టుబడుల సమయంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నట్టు వచ్చిన వార్తలను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అంగీకరించింది. ‘‘ఇటీవలే నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌ సదుపాయాలను విస్తరించే లక్ష్యంతో నూతన వ్యవస్థకు మారిపోవడం జరిగింది. ఇది ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసినది. ఆ సమయంలో సెటిల్‌మెంట్‌ ఆలస్యం కావడం వంటి ఆరంభ సమస్యలను ఎదుర్కొన్నాము. కానీ, అదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎన్‌ఏవీలు నిధులు జమ అయిన రోజు నుంచే అమల్లోకి వస్తాయన్న నియంత్రణపరమైన నిబంధనల అమలు (ఫిబ్రవరి 1నుంచి) కూడా జరిగింది.

సాంకేతిక సమస్యలు వస్తే ఇన్వెస్టర్లకు పరిహారం    
కాగా సాంకేతిక సమస్యల కారణంగా నష్టపోయే ఇన్వెస్టర్లకు పరిహారం లభించే విధంగా సెబీ కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

మరిన్ని వార్తలు