ఐపీవో ధరల్ని నిర్ణయించడం సెబీ పని కాదు

14 Sep, 2022 10:44 IST|Sakshi

ముంబై: ఆధునికతరం(న్యూఏజ్‌) టెక్నాలజీ కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టే విషయంలో ధరల నిర్ణయంపై సెబీ ప్రభావం ఉండబోదని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ చైర్‌పర్శన్‌ మాధవీ పురీ బచ్‌ పేర్కొన్నారు. ఇది తమ బాధ్యత కాదని స్పష్టం చేశారు. అయితే ఇలాంటి ఇష్యూలకు సంబంధించి ఏవైనా ఆందోళనలుంటే ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు బాధ్యత తీసుకోవచ్చని తెలియజేశారు.

ఐపీవో చేపట్టదలచిన స్టార్టప్‌లు కంపెనీ విలువలో ఏర్పడిన మార్పులు తదితర కొన్ని భవిష్యత్‌ అంశాలను వెల్లడించేందుకు సిద్ధపడాలని సూచించారు. ఐపీవోకు ముందు షేర్ల జారీ, ఐపీవోకు ఆశిస్తున్న ధర వ్యత్యాసం వంటి అంశాలను వివరించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఐపీవోకు ఏ ధరను ఆశిస్తున్నారో అది మీ బిజినెస్‌ను ప్రతిబింబించాలని విశ్లేషించారు.  

పలు మార్పులు 
న్యూటెక్‌ కంపెనీల ఐపీవో ధరల నిర్ణయంలో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు బచ్‌ తెలియజేశారు. న్యూఏజ్‌ టెక్‌ కంపెనీల ఐపీవో ధరలను నిర్ణయించడం తమ బిజినెస్‌కాదంటూనే సంస్థలు తమ బిజినెస్‌ ఆధారంగా స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. గతంలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా పనిచేసిన బచ్‌ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన ఒక సదస్సులో ప్రసంగించారు. 

ఇటీవల స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ చేపట్టిన పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ పేటీఎమ్‌ షేరు ఐపీవో ధరతో పోలిస్తే మూడోవంతుకు పతనమైన విషయం విదితమే. దీంతో ఇన్వెస్టర్లు న్యూఏజ్‌ టెక్‌ కంపెనీల ఐపీవోలకు అధిక ధరల నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కొద్ది రోజులుగా మరికొన్ని న్యూఏజ్‌ కంపెనీల షేర్లు సైతం ఐపీవో ధరలతో పోలిస్తే పతన బాటలో సాగుతున్నాయి. ఈ నేప థ్యంలో సెబీ చైర్‌పర్శన్‌ బచ్‌ వ్యాఖ్యలకు ప్రాధా న్యత ఏర్పడినట్లు నిపుణులు తెలియజేశారు.   

మరిన్ని వార్తలు