మే 12వరకూ ఎల్‌ఐసీకి గడువు

14 Mar, 2022 08:23 IST|Sakshi

సెబీ తాజా అనుమతుల నేపథ్యం

న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు మే 12వరకూ గడువున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఆలోగా కంపెనీ ఐపీవోకు మరోసారి క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందవలసిన అవసరంలేదని తెలియజేశారు. 

ఐపీవోలో భాగంగా ప్రభుత్వం ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ. 60,000 కోట్లకుపైగా సమకూర్చుకునే వీలుంది. ఇందుకు అనుగుణంగా ధరల శ్రేణి, ఆఫర్‌ చేయనున్న ఈక్విటీ వివరాలు తదితరాలతో ఆర్‌హెచ్‌పీని దాఖలు చేయవలసి ఉంది. నిజానికి మార్చిలోగా ఎల్‌ఐసీని లిస్టింగ్‌ చేయాలని ప్రభుత్వం తొలుత ప్రణాళికలు వేసింది. అయితే రష్యా–ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇటీవల స్టాక్‌ మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు అధికారిక వర్గాలు ఇప్పటికే తెలియజేశాయి.
 

మరిన్ని వార్తలు