క్యూ2లో పెరగనున్న సెక్యూరిటైజేషన్‌

12 Oct, 2021 06:11 IST|Sakshi

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనాలు

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల సెక్యూరిటైజేషన్‌ భారీగా ఎగసే వీలున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. క్యూ2(జులై–సెపె్టంబర్‌)లో సెక్యూరిటైజేషన్‌ 45 శాతం జంప్‌చేయనున్నట్లు ఇక్రా రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. వీటి విలువ రూ. 25,000 కోట్లను తాకవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో రూ. 17,200 కోట్ల విలువైన సెక్యూరిటైజేషన్‌ నమోదుకాగా.. గతేడాది(2020–21) క్యూ2లో ఈ విలువ రూ. 15,200 కోట్లకు చేరింది. ఒకేతరహా ఇల్లిక్విడ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ను క్రోడీకరించి మార్కెట్లో విక్రయించగల సెక్యూరిటీలుగా రీప్యాకేజింగ్‌ చేయడాన్ని సెక్యూరిటైజేషన్‌గా పేర్కొనే సంగతి తెలిసిందే. వీటిని సంబంధిత ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ఆర్‌బీఐ తీసుకువచి్చన తాజా మార్గదర్శకాల నేపథ్యంలో సెక్యూరిటైజేషన్‌ మార్కెట్‌ విస్తరించనున్నట్లు ఇక్రా తెలియజేసింది. దీంతో గత నెలలో పరిమాణరీత్యా 60 శాతం సెక్యూరిటైజేషన్‌ నమోదైనట్లు వెల్లడించింది.   

తొలి అర్ధభాగంలో...
సెకండ్‌ వేవ్‌ పరిస్థితుల్లోనూ ఏప్రిల్‌–సెపె్టంబర్‌ మధ్య రూ. 42,200 కోట్ల సెక్యూరిటైజేషన్‌కు వీలున్నట్లు ఇక్రా అంచనా వేసింది. గతేడాది ఇదే కాలంలో ఈ విలువ రూ. 22,700 కోట్లు మాత్రమేకాగా.. ఈ ఏడాది సెక్యూరిటైజేషన్‌ పరిమాణం రూ. 1.2 లక్షల కోట్లను తాకనున్నట్లు తాజాగా అభిప్రాయపడింది. ఇది 40% అధికమని తెలియజేసింది.

మరిన్ని వార్తలు