Aadhaar Card: ఆధార్ కార్డ్‌ వినియోగదారులకు శుభవార్త, ఆధార్‌ నెంబర్‌తో మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు

19 Nov, 2021 16:29 IST|Sakshi

ఆధార్‌ కార్డ్‌ వినియోగదారులకు శుభవార్త. ఇకపై మీరు ఆధార్‌ కార్డ్‌ నెంబర్‌తో భీమ్ యూపీఐ ద్వారా డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. కరోనా కారణంగా మనదేశంలో ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ విపరీతంగా పెరిగిపోయాయి. కాలేజీ ఫీజుల నుంచి కిరాణా స్టోర్‌లలో కొనుగోలు చేసే నిత్యవసర సరుకుల పేమెంట్స్‌ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అయితే ఈ సదుపాయం కేవలం ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారుల ఫోన్‌లకు మాత్రమే ఉంది.

ఉదాహరణకు, స్మార్ట్‌ఫోన్ లేదా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) అడ్రస్‌లేని వారికి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయడం కష్టంగా మారింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి, 'భీమ్‌' (భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ)ని ఉపయోగించే వ్యక్తులు ఫోన్ లేదా, యూపీఐ అడ్రస్‌ లేని వారికి ఆధార్ నెంబర్‌ని ఉపయోగించి డబ్బు పంపవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (uidai) వెల్లడించింది.

భీమ్‌ అనేది యూపీఐ (Unified Payment Interface-UPI) ఆధారిత యాప్‌. ఇందులో మొబైల్ నంబర్, పేరుతో మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అయితే యూఐడీఏఐ ప్రకారం.. ఇకపై భీమ్‌ యాప్‌లో లబ్ధి దారుల అడ్రస్‌ విభాగంగాలో ఆధార్‌ నెంబర్‌ను ఉపయోగించి మనీని సెండ్‌ చేయొచ్చు. భీమ్‌లోని లబ్ధిదారుల చిరునామాలో ఆధార్ నంబర్‌ని ఉపయోగించి డబ్బు పంపే ఆప్షన్‌ కనిపిస్తుంది.  

భీమ్‌లో ఆధార్ నంబర్‌ని ఉపయోగించి డబ్బు ఎలా పంపాలి? 
భీమ్‌లో ఆధార్ నంబర్‌ని ఉపయోగించి లబ్ధిదారుని 12 అంకెల ప్రత్యేక ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేసి వెరిఫై బటన్‌ను క్లిక్‌ చేయాలి. 

దీని తర్వాత, సిస్టమ్ ఆధార్ లింకింగ్, లబ్ధిదారుల చిరునామాను ధృవీకరిస్తుంది. యూఐడీఏఐ అందించిన సమాచారం ప్రకారం వినియోగదారుడు నగదును పంపొచ్చు. అలా పంపిన నగదు లబ్ధి దారుడి అకౌంట్‌లో మనీ క్రెడిట్‌ అవుతుంది 

అలాగే, చెల్లింపులను స్వీకరించడానికి ఆధార్ పే పీఓఎస్‌ని ఉపయోగించే వ్యాపారులకు డిజిటల్ చెల్లింపు చేయడానికి ఆధార్ నంబర్,వేలిముద్రను ఉపయోగించాలి. 

ఒకవేళ, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్‌లు ఉండి, ఆ అకౌంట్‌లకు ఆధార్‌తో లింక్ చేయబడితే, అటువంటి పరిస్థితిలో అన్ని అకౌంట్‌లను డబ్బుల్ని సెండ్‌ చేయొచ్చని యూఐడీఏఐ తెలిపింది.   

చదవండి: గూగుల్‌ అదిరిపోయే ఫీచర్‌, రద్దీ ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తుంది..!

మరిన్ని వార్తలు