వృద్దుల కోసం ఉత్తమమైన‌ పొదుపు ప‌థ‌కాలు!

14 Apr, 2021 15:22 IST|Sakshi

బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు అధిక వ‌డ్డీతో హామినిచ్చే కొన్ని పెట్టుబ‌డి ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొంత మొత్తం డిపాజిట్ చేయడం ద్వారా ప్రతి నెల లేదా ఏడాదికి వడ్డీ రూపంలో నగదు లభిస్తుంది. ఈ వయస్సులో వారికి ఇలాంటి పథకాలు ఆర్థిక చేయూతను ఇస్తాయి. ఎస్‌బీఐతో స‌హా కొన్ని అగ్ర బ్యాంకులు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 5-10 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాల‌ప‌రిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై గ‌రిష్టంగా 6.2 శాతం వ‌డ్డీని అందిస్తున్నాయి. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కారణంగా బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాయి. అయితే, బ్యాంక్‌ల క‌న్నా పోస్ట్ ఆఫీస్ పొదుపు ప‌థ‌కాలు అధిక వ‌డ్డీని అందిస్తాయి. సీనియ‌ర్ సిటిజ‌న్లుకు ఆర్థిక చేయూతను ఇచ్చే కొన్ని పెట్టుబడి పథకాల గురుంచి తెలుసుకుందాం..

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్‌ స్కీమ్(ఎస్సీఎస్ఎస్‌)
సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్( ఎస్సిఎస్ఎస్ ) అనేది ప్రభుత్వం నడుపుతున్న చిన్న పొదుపు పథకం. దీనిలో చేరిన వారికీ ప్రస్తుతం సంవత్సరానికి 7.40 శాతం అందిస్తుంది. ఎస్సీఎస్‌ఎస్‌కు ఐదేళ్ల కాలపరిమితి ఉంది. దీనిని మరో మూడేళ్ల వరకు పొడిగించవచ్చు. అయితే, ఎస్సీఎస్‌ఎస్‌లో పెట్టుబడులు పెట్టడానికి గరిష్టపరిమితి రూ.15 లక్షలు. త్రైమాసిక ప్రాతిపదికన అధిక స్థిర రాబడి మరియు సాధారణ ఆదాయం కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లకు ఎస్సిఎస్ఎస్ మంచి ఆదాయ వనరు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80 సి కింద ఎస్సీఎస్‌ఎస్‌లో పెట్టుబడులు ద్వారా వచ్చిన నగదుపై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హులు.

స్పెష‌ల్ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డి) ప‌థ‌కం
చాలా మంది సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎల్లప్పుడూ ఒక మంచి ఎంపిక. బ్యాంక్ ఎఫ్‌డిలు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక వడ్డీ రేటు చెల్లింపులను అందిస్తాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిపాజిట్లపై 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్రత్యేక ఎఫ్‌డిలు 30 జూన్ 2021 వరకు అమలులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు 6 శాతం నుంచి 7 శాతంపైన వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు అందిస్తున్నాయి.

ప్రధాన్ మంత్రి వయా వందన యోజన(పీఎంవీవీవై)
పీఎంవీవీవై(ప్రధాన్ మంత్రి వయా వందన యోజన) అనేది సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) నిర్వహిస్తుంది. పిఎమ్‌వివివై పథకం 2023 మార్చి 31 వరకు పొడిగించబడింది. ప్రస్తుతం, ఈ పథకం కింద పెట్టుబడి పెట్టిన నగదుపై ప్రతి నెలకు సంవత్సరానికి 7.40 శాతం చొప్పున పెన్షన్‌ను అందిస్తోంది. కాల ప‌రిమితి 10 సంవ‌త్స‌రాలు.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఆదాయ పథకం(పీఓఎంఐఎస్)
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్) కింద 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒకసారి పెట్టుబడి పెడితే గడువు కాలం ముగిసే వరకు వడ్డీ రేటు అలాగే ఉంటుంది. ప్రస్తుతం, జూన్ 2021తో ముగిసిన త్రైమాసికంలో వడ్డీ రేటు సంవత్సరానికి 6.6 శాతంగా ఉంది.

చదవండి: డేంజర్ జోన్‌లో వాట్సప్‌ యూజర్లు!

మరిన్ని వార్తలు