కొత్త చరిత్ర- 43,000 దాటిన సెన్సెక్స్

10 Nov, 2020 15:59 IST|Sakshi

రెండో రోజూ మార్కెట్ల సరికొత్త రికార్డులు

680 పాయింట్లు ప్లస్- 43,278కు సెన్సెక్స్

170 పాయింట్లు జమ- 12,631 వద్ద నిలిచిన నిఫ్టీ

బ్యాంకింగ్ 4 శాతం అప్- ఐటీ, ఫార్మా 4 శాతం డౌన్

బీఎస్ఈలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం వీక్

ముంబై: వరుసగా ఏడో రోజూ స్టాక్ బుల్ కాలు దువ్వింది. రోజంతా లాభాల దౌడు తీసింది. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 43,000 పాయింట్ల మైలురాయిని సులభంగా అధిగమించింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం వరుసగా రెండో రోజు చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 680 పాయింట్లు జంప్ చేసి 43,278 వద్ద నిలిచింది. నిఫ్టీ 170 పాయింట్లు ఎగసి 12,631 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,316 వద్ద, నిఫ్టీ 12,644 వద్ద గరిష్టాలను తాకాయి. వెరసి వరుసగా రెండో రోజు మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. 

రియల్టీ జోరు
ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ 4 శాతం జంప్ చేయగా.. రియల్టీ 2 శాతం ఎగసింది. ఫార్మా, ఐటీ 4 శాతం స్థాయిలో పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, ఎల్అండ్ టీ, బజాజ్ ఫిన్, స్టేట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, గెయిల్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, ఐటీసీ, యాక్సిస్, ఎస్బీఐ లైఫ్ 9-3 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే టెక్ మహీంద్రా, సిప్లా, హెచ్సీఎల్ టెక్, దివీస్, నెస్లే, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, టీసీఎస్, విప్రో, హిందాల్కో, మారుతీ, ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ 6-1 శాతం మధ్య పతనమయ్యాయి.

ఇండిగో జూమ్
డెరివేటివ్ కౌంటర్లలో ఇండిగో, అశోక్ లేలాండ్, యూబీఎల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, ఆర్బీఎల్ బ్యాంక్, పీవీఆర్, భారత్ ఫోర్జ్, ఫెడరల్ బ్యాంక్ 9-5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ముత్తూట్, కేడిలా, లుపిన్, జూబిలెంట్ ఫుడ్, కోఫోర్జ్, టొరంట్  ఫార్మా, మైండ్ ట్రీ, అరబిందో, నౌకరీ, మారికో 7-3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ 0.5 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,231 లాభపడగా.. 1,482 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,548 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 3,036 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 4,870 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 2,939 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు