667 పాయింట్లు పతనం
36,940 వద్ద ముగిసిన సెన్సెక్స్
182 పాయింట్లు కోల్పోయి 10,892కు నిఫ్టీ
ప్రయివేట్ బ్యాంక్స్ 3 శాతం డౌన్
రియల్టీ, ఐటీ, ఆటో 1.2-0.5 శాతం వీక్
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి మరింత క్షీణించాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో పతనంతో ముగిశాయి. సెన్సెక్స్ 667 పాయింట్లు కోల్పోయి 36,940 కు చేరగా.. నిఫ్టీ 182 పాయింట్ల వెనకడుగుతో 10,892వద్ద నిలిచింది. వెరసి సెన్సెక్స్ 37,000 పాయింట్లు .. నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్ దిగువన స్థిరపడ్డాయి. సమయం గడిచేకొద్దీ అమ్మకాలు ఊపందుకోవడంతో తొలుత 11,058 వద్ద గరిష్టాన్ని తాకిన నిఫ్టీ.. తదుపరి 10,882 వద్ద కనిష్టాన్ని చేరింది.
పీఎస్యూ బ్యాంక్స్ ప్లస్
ఎన్ఎస్ఈలో ప్రయివేట్ బ్యాంక్స్ దాదాపు 3 శాతం క్షీణించగా.. రియల్టీ, మీడియా, ఐటీ, ఆటో 1.2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే పీఎస్యూ బ్యాంక్స్ 0.5 శాతం, మెటల్ 0.3 శాతంచొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కొటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐవోసీ, యాక్సిస్, ఆర్ఐఎల్, గెయిల్, జీ, బజాజ్ ఆటో,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ 5.4-2.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఇతర బ్లూచిప్స్లో టాటా మోటార్స్ 7 శాతం జంప్చేయగా.. టైటన్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఐషర్, బీపీసీఎల్, హెచ్సీఎల్ టెక్ 4-0.5 శాతం మధ్య ఎగశాయి.
చిన్న షేర్లు ఓకే
డెరివేటివ్ కౌంటర్లలో బంధన్ బ్యాంక్ 10.5 శాతం కుప్పకూలగా.. అపోలో హాస్పిటల్స్, ఐబీ హౌసింగ్, ఉజ్జీవన్, ఆర్బీఎల్, ఎస్బీఐ లైఫ్, మ్యాక్స్ ఫైనాన్స్, ఈక్విటాస్, ఐజీఎల్ 6-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క మైండ్ట్రీ, ఐడియా, జిందాల్ స్టీల్, టొరంట్ ఫార్మా, కేడిలా, మదర్సన్, టీవీఎస్, పీఎన్బీ, జూబిలెంట్ ఫుడ్ 7-1.7 మధ్య పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.3 శాతం క్షీణించగా , స్మాల్ క్యాప్ 1 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1386 లాభపడగా.. 1257 నష్టాలతో ముగిశాయి.
ఎఫ్పీఐల వెనకడుగు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 959 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 443 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.