250 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్- 38,788కు
60 పాయింట్ల లాభంతో 11,445 వద్ద నిఫ్టీ
ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే
బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8 శాతం అప్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహం, దేశీయంగా బలపడిన సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలుత 250 పాయింట్లు జంప్చేసింది. 38,788ను అధిగమించింది. ప్రస్తుతం 205 పాయింట్లు బలపడి 38,733కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 60 పాయింట్లు ఎగసి 11,445 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం అమెరికన్ ఇండెక్సులు ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త గరిష్టాలను అందుకోగా.. ఆసియాలో మార్కెట్లు ప్రస్తుతం అటూఇటుగా కదులుతున్నాయి.
బ్లూచిప్స్ తీరిలా
ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. పీఎస్యూ బ్యాంక్స్ అత్యధికంగా 2.3 శాతం ఎగశాయి. ఆటో, ప్రయివేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ 1-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎస్బీఐ, హీరో మోటో, అదానీ పోర్ట్స్, ఇన్ప్రాటెల్, ఐసీఐసీఐ, గెయిల్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, జీ, ఐటీసీ, యాక్సిస్ 2.2-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్సీఎల్ టెక్, గ్రాసిమ్, నెస్లే, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్, టాటా స్టీల్ 1.2-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి.
అదానీ జోరు
డెరివేటివ్ కౌంటర్లలో అదానీ ఎంటర్ప్రైజెస్ 6.5 శాతం జంప్చేయగా.. పీఎన్బీ, కెనరా బ్యాంక్, పిరమల్, ఫెడరల్ బ్యాంక్, సెంచురీ టెక్స్, ఎల్ఐసీ హౌసింగ్, ఎస్కార్ట్స్, భెల్, మణప్పురం, పీవీఆర్, నౌకరీ, లుపిన్ 4.4-2 శాతం మధ్య జోరు చూపాయి. కాగా.. మరోపక్క అమరరాజా, ఐడియా 2 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1335 లాభపడగా.. 521 నష్టాలతో కదులుతున్నాయి.