50 వేల మార్క్ దాటిన సెన్సెక్స్!

18 May, 2021 16:15 IST|Sakshi

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. దేశంలో కోవిడ్‌ కేసుల్లో తగ్గుదలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం విడుదల కావడం వంటి పరిణామాలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించాయి. దీంతో దేశీయ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. మార్చి 12 తరువాత నిఫ్టీ మొదటిసారి 15,000 పాయింట్లను దాటగలిగింది. ఇక ట్రేడింగ్ ముగిసే సమయానికి 184.95 పాయింట్లు లేదా 1.24 శాతం లాభంతో 15,108.10 వద్ద ముగిసింది. అదే సమయంలో సెన్సెక్స్ 612.60 పాయింట్లు లేదా 1.24 శాతం పెరుగుదలతో 50,193.33 వద్ద స్టిర పడింది. 

ఫెడరల్ బ్యాంక్(ఫెడరల్ బ్యాంక్) షేర్లు మంగళవారం 6 శాతం పెరిగాయి. మార్చి 2021 త్రైమాసికంలో ఫెడరల్ బ్యాంక్ నికర లాభం 59 శాతం పెరిగి 478 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.1301 కోట్లు. త్రైమాసిక ప్రాతిపదికన బ్యాంకు లాభం కూడా 5.8 శాతం పెరిగింది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ.404 కోట్లు. టీసీఐ ఎక్స్‌పోర్ట్స్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌, వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు భారీ లాభాల్లో ముగిస్తే.. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌ మెంట్‌, హింద్‌ కన్‌స్ట్రక్షన్‌ కో, హెస్టర్‌ బయోసైన్స్‌, కెనరా బ్యాంక్‌, బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

చదవండి:

ప్రపంచ అమ్మకాల్లో రికార్డ్ సృష్టించిన టీవీఎస్ స్కూటర్

మరిన్ని వార్తలు