అక్కడ జీరో కరోనా కేసులు, ఇక్కడి మార్కెట్లకు ఊతం

28 Jun, 2022 16:09 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా కోలుకున్నాయి. రోజంతా లాభనష్టాలమధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు ఆరంభ నష్టాలనుంచి కోలుకున్నాయి. వరుసగా నాలుగో సెషన్‌లో లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంతో  53,177 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 15,850 వద్ద స్థిరపడింది. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిల ఎగువకు చేరాయి. చైనాలోని ప్రధాన నగరాలు బీజింగ్‌, షాంఘైలో కరోనా కేసుల నమోదు జీరోకు చేరడం, కోవిడ్-19 క్వారంటైన్ సమయాన్ని తగ్గించడం ఆసియా  మార్కెట్లకు బలాన్నిచ్చింది. 

ఆటో, మెటల్, ఆయిల్  అండ్‌  గ్యాస్ షేర్లు వరుసగా 1.25 శాతం, 1.67 , 2.27 శాతం లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ 6 శాతం లాభపడగా,  హిందాల్కో, కోల్ ఇండియా, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. వీటితోపాటు సెన్సెక్స్‌లో ఎంఅండ్‌ఎం, టాటాస్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, డా.రెడ్డీస్, టెక్‌ఎం, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ  లాభపడ్డాయి.

మరోవైపు టైటాన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, సన్ ఫార్మా, పవర్‌గ్రిడ్, ఎయిర్‌టెల్ నష్టాల్లో ముగిశాయి. అలాగే ఫుడ్ డెలివరీసంస్థ జొమాటో 8.35 శాతంపతనమై 60.35 వద్ద ముగిసింది. అటు డాలరు మారకంలో రూపాయి మంగళవారం  78.83 వద్ద మరో ఆల్‌టైం కనిష్టాన్ని నమోదు చేసింది.  చివరికి 55 పైసల నష్టంతో 78.77 వద్ద ముగిసింది. వరుసగా ఐదో సెషన్‌లోనూ  రికార్డు కనిష్టం వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు