ముంబై: కరోనా మహమ్మారి దెబ్బకు స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. పలు రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ విధించనున్నట్లు వస్తున్న వార్తలతో సూచీలు కుప్పకూలిపోయాయి. ఒక్క రోజులో 3శాతానికి పైగా పతనమయ్యాయి. సోమవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా 1700 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీంతో దలాల్ స్ట్రీట్లో మునుపెన్నడూ లేని విధంగా రూ.8లక్షల కోట్ల మేర మదపర్ల సంపద ఆవిరైంది. ఫలితంగా మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ నేడు రూ.8లక్షల కోట్లు తగ్గి రూ. 201లక్షల కోట్లకు పరిమితమైంది.
ట్రేడింగ్ ఆరంభమైన కొద్ది క్షణాల్లోనే భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ ఉదయం 48,956 వద్ద ట్రేడింగ్ను ఆరంభించిన సెన్సెక్స్ కాసేపటికే 1400 పాయింట్లు పతనమైంది. ఇంట్రాడేలో 47,693 వద్ద కనిష్ఠ స్థాయిని తాకిన సూచీ చివరకు కాస్త కోలుకున్నా భారీ నష్టం తప్పలేదు. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 1707.94(3.44శాతం) పాయింట్లు నష్టపోయి 47,883.38 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 524.10 (3.53%) పాయింట్లు కిందకు చేరుకొని 14,310.80 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు 9శాతానికి పైగా కుంగిపోగా.. ఆటో, ఎనర్జీ, ఇన్ఫ్రా, లోహ రంగ షేర్లు 4-5 శాతం నష్టపోయాయి.
చదవండి: