బడ్జెట్‌ బూస్ట్‌ : బుల్‌ దౌడు

19 Jan, 2021 15:48 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీగా ర్యాలీ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. దీంతో భారత బెంచ్‌ మార్క్ సూచికలు 2 శాతం ఎగిసాయి.  ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 900 పాయింట్లుకు పైగా లాభపడింది. చివరికి సెన్సెక్స్‌ 834 పాయింట్ల లాభంతో 49398 వద్ద, నిఫ్టీ  240 పాయింట్లు ఎగిసి 14521 వద్ద పటిష్టంగా ముగిసాయి. తద్వారా సెన్సెక్స్ మరోసారి 50వేలకు చేరువలో ఉండగా నిఫ్టీ 14500 ఎగువన ముగియడం విశేషం. ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, పీఎస్‌యు బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ లాభపడ్డాయి. 

సెన్సెక్స్ లాభాలలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌ సర్వ్‌ (ఒక్కొక్కటి 5శాతం లాభం) ఎక్కువగా తోడ్పడ్డాయి. టాటా మెటార్స్‌, ఐసిఐసిఐ , కోటక్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఎల్‌ అండ్‌ టీ షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో ఏషియన్ పెయింట్స్ కూడా  లాభపడ్డాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి, భారతి ఎయిర్‌టెల్‌, సిప్లా, గెయిల్‌, హిందాల్కో లాభపడిన వాటిల్లో ఉన్నాయి. డిసెంబరు 2020 త్రైమాసికంలో మైండ్ ‌ట్రీ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 65.7 శాతం పెరిగి 326.5 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో షేర్లు 4 శాతం పెరిగాయి. అటు ఎంఅండ్‌ఎం, ఐటీసీ, టెక్‌ మహీంద్ర స్వల్పంగా నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు, రాబోయే బడ్జెట్‌లో ఆర్థిక సంస్కరణల  ఆశలు బుల్లిష్ సెంటిమెంట్‌కు దారితీసిందని విశ్లేషకులు  భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు