సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ- ఫార్మా జూమ్‌

10 Aug, 2020 09:36 IST|Sakshi

సెన్సెక్స్‌ 309 పాయింట్లు అప్‌

95 పాయింట్లు ఎగసిన నిఫ్టీ

4 శాతం జంప్‌చేసిన ఫార్మా ఇండెక్స్‌

బ్యాంకింగ్‌, రియల్టీ, ఆటో రంగాలు ప్లస్‌లో

ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 309 పాయింట్లు ఎగసి 38,350కు చేరింది. నిఫ్టీ 95 పాయింట్లు బలపడి 11,309 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్లు అటూఇటుగా నిలవగా.. ప్రస్తుతం ఆసియాలోనూ మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. అయినప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించినట్లు నిపుణులు పేర్కొన్నారు.

మెటల్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ మాత్రమే(0.3 శాతం) నీరసించగా. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ఫార్మా దాదాపు 4 శాతం జంప్‌చేయగా.. బ్యాంకింగ్‌, రియల్టీ, ఆటో 1 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, శ్రీ సిమెంట్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, సన్‌ ఫార్మా 5-1.5 శాతం మధ్య పురోగమించాయి. అయితే ఏషియన్‌ పెయింట్స్‌, బీపీసీఎల్‌, హీరో మోటో, టాటా స్టీల్‌, హిందాల్కో, మారుతీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, నెస్లే 1-0.5 శాతం మధ్య నష్టపోయాయి.

దివీస్‌ దూకుడు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో దివీస్‌ 15 శాతం దూసుకెళ్లగా.. బీఈఎల్‌, భారత్‌ ఫోర్జ్‌, భెల్‌, అరబిందో, ఆర్‌ఈసీ, మదర్‌సన్, ఐబీ హౌసింగ్‌, పీఎఫ్‌సీ 8.3-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఎంజీఎల్‌, ఆర్‌బీఎల్‌, టొరంట్‌ పవర్‌, రామ్‌కో సిమెంట్‌, సీమెన్స్‌, బాటా, జిందాల్‌ స్టీల్‌ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.5-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1313 లాభపడగా.. 484 నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు