నేడు సానుకూల ఓపెనింగ్ చాన్స్!
ఎస్జీఎక్స్ నిఫ్టీ 15 పాయింట్లు ప్లస్
ప్రస్తుతం ఆసియా మార్కెట్లు లాభాల్లో
యూరోపియన్, యూఎస్ మార్కెట్లు అప్
నేడు (13న) దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 15 పాయింట్లు పుంజుకుని 11,330 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,315 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. బుధవారం యూరోపియన్, యూఎస్ మార్కెట్లు 1-2 శాతం మధ్య ఎగశాయి. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. దీంతో నేడు మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభంకావచ్చని, తదుపరి కొంతమేర ఆటుపోట్లకు లోనయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
స్వల్ప నష్టాలు
జూన్లో పారిశ్రామికోత్పత్తి నీరసించడం, విదేశీ మార్కెట్ల బలహీనతలతో బుధవారం మార్కెట్లు నష్టాల మధ్యే కదిలాయి. చివరికి సెన్సెక్స్ 37 పాయింట్లు క్షీణించి 38,370 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 13 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,309 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,243- 11,322 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,260 పాయింట్ల వద్ద, తదుపరి 11,212 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,339 పాయింట్ల వద్ద, ఆపై 11,370 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,061 పాయింట్ల వద్ద, తదుపరి 21,857 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,397 పాయింట్ల వద్ద, తదుపరి 22,530 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 351 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 940 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 1014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1415 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. ఇక సోమవారం ఎఫ్పీఐలు రూ. 303 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 505 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.