ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ 20 పాయింట్లు ప్లస్
లాభాల్లో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు
నిఫ్టీకి 11,419-11,372 వద్ద సపోర్ట్స్
రెండో రోజూ యూఎస్ మార్కెట్ల రికార్డ్
నేడు (25న) దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 11,498 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,478 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్ దిగ్గజాల అండతో వరుసగా రెండో రోజు సోమవారం యూఎస్ మార్కెట్లు లాభపడ్డాయి. ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. ఈ ప్రభావంతో ప్రస్తుతం ఆసియాలోనూ హాంకాంగ్ మినహా మిగిలిన మార్కెట్లు 1.5-0.3 శాతం మధ్య లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ మార్కెట్లు తొలి సెషన్లో సానుకూలంగా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జీడీపీ గణాంకాల వెల్లడి, ఎఫ్అండ్వో ముగింపు తదితర అంశాలు ముందున్న కారణంగా కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రెండో రోజూ దూకుడు
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దూకుడు చూపాయి. సోమవారం సెన్సెక్స్ 364 పాయింట్లు జంప్చేసి 38,799 వద్ద నిలవగా.. 95 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 11,467 వద్ద ముగిసింది. వారాంతాన సైతం నష్టాలను పూడ్చుకుంటూ మార్కెట్లు ఇదే స్థాయిలో పుంజుకున్న విషయం విదితమే. నిఫ్టీ ఇంట్రాడేలో 11,497 వద్ద గరిష్టాన్నీ, 11,411 దిగువన కనిష్టాన్నీ తాకింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,419 పాయింట్ల వద్ద, తదుపరి 11,372 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,506 పాయింట్ల వద్ద, ఆపై 11,545 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు.
ఎఫ్పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 219 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 336 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 410 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 251 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.