ఎస్జీఎక్స్ నిఫ్టీ 12 పాయింట్లు మైనస్
నిఫ్టీకి 11,366-11,316 వద్ద సపోర్ట్స్!
వారాంతాన యూఎస్ మార్కెట్లు డీలా
ప్రస్తుతం సానుకూలంగా ఆసియా మార్కెట్లు
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు
నేడు(5న) దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 12 పాయింట్లు నీరసించి 11,428 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ 11,440 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వారాంతాన యూఎస్ మార్కెట్లు 0.5-2.2 శాతం మధ్య క్షీణించగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు ప్రస్తావించదగ్గ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈ అంశాల నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
మార్కెట్ల హైజంప్
రెండు రోజుల కన్సాలిడేషన్ నుంచి బయటపడుతూ గురువారం దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. సెన్సెక్స్ 629 పాయింట్లు దూసుకెళ్లి 38,697 వద్ద నిలవగా.. నిఫ్టీ 170 పాయింట్లు జమ చేసుకుని 11,417 వద్ద ముగిసింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడ్డారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,739వరకూ జంప్చేయగా.. నిఫ్టీ 11,429 వరకూ ఎగసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,366 పాయింట్ల వద్ద, తదుపరి 11,316 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,448 పాయింట్ల వద్ద, ఆపై 11,479 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,842 పాయింట్ల వద్ద, తదుపరి 21,438 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,472 పాయింట్ల వద్ద, తదుపరి 22,697 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,632 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 259 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 712 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 409 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.