ఎస్జీఎక్స్ నిఫ్టీ 27 పాయింట్లు ప్లస్
నిఫ్టీకి 11,359-11,279 వద్ద సపోర్ట్స్
యూఎస్ మార్కెట్లు.. 1.5 శాతం అప్
ప్రస్తుతం ఆసియా మార్కెట్లు మిశ్రమం
కొనసాగుతున్న ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్
నేడు(15న) మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 27 పాయింట్లు బలపడి 11,461 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,434 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్నాలజీ షేర్లకు తిరిగి డిమాండ్ నెలకొనడంతో సోమవారం యూఎస్ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లలో అత్యధిక శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు నేడు కొంతమేర ఒడిదొడుకుల మధ్య ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
చివర్లో పతనం
సోమవారం హుషారుగా మొదలైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి డీలాపడ్డాయి. చివర్లో పెరిగిన అమ్మకాలు దెబ్బతీశాయి. సెన్సెక్స్ 98 పాయింట్లు క్షీణించి 38,757 వద్ద ముగిసింది. నిఫ్టీ 24 పాయింట్లు తక్కువగా 11,440 వద్ద స్థిరపడింది. తొలిసెషన్లో 39,230 వరకూ జంప్చేయగా.. నిఫ్టీ సైతం 11,569కు ఎగసింది. తదుపరి సెన్సెక్స్ 38,573 వద్ద, నిఫ్టీ 11,384 దిగువన కనిష్టాలకు చేరాయి.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,359 పాయింట్ల వద్ద, తదుపరి 11,279 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,545 పాయింట్ల వద్ద, ఆపై 11,650 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,834 పాయింట్ల వద్ద, తదుపరి 21,566 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,563 పాయింట్ల వద్ద, తదుపరి 23,025 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 1,176 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డీఐఐలు రూ. 724 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.