ఎస్జీఎక్స్ నిఫ్టీ 53 పాయింట్లు అప్
నిఫ్టీకి 12,692-12,752 వద్ద రెసిస్టెన్స్!
మళ్లీ మిశ్రమంగా యూఎస్ మార్కెట్లు
ప్రస్తుతం అటూఇటుగా ఆసియా మార్కెట్లు
పెట్టుబడుల బాట వీడని ఎఫ్పీఐలు
ముంబై: నేడు (11న) వరుసగా 8వ రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 53 పాయింట్లు ఎగసి 12,715 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ 12,662 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. మంగళవారం మరోసారి యూఎస్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డోజోన్స్ లాభపడగా.. నాస్డాక్ డీలా పడింది. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. కాగా.. 7 రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో దేశీయంగా నేడు లాభాల స్వీకరణకు అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
43,000 దాటిన సెన్సెక్స్
ఏడో రోజూ ర్యాలీ నేపథ్యంలో మంగళవారం తొలిసారి సెన్సెక్స్ 43,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 680 పాయింట్లు జంప్ చేసి 43,278 వద్ద నిలిచింది. నిఫ్టీ 170 పాయింట్లు ఎగసి 12,631 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,316 వద్ద, నిఫ్టీ 12,644 వద్ద గరిష్టాలను తాకాయి. వెరసి వరుసగా రెండో రోజు మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 12,523 పాయింట్ల వద్ద, తదుపరి 12,415 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 12,692 పాయింట్ల వద్ద, ఆపై 12,752 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 28,081 పాయింట్ల వద్ద, తదుపరి 27,556 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 28,967 పాయింట్ల వద్ద, తదుపరి 29,327 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.
ఎఫ్పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 5,627 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,309 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 4,548 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 3,036 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల తొలి వారంలో ఎఫ్పీఐలు ఏకంగా రూ. 13,399 కోట్ల పెట్టుబడులు కుమ్మరించడం గమనార్హం! అక్టోబర్లో రూ. 14,537 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు.