ఎస్జీఎక్స్ నిఫ్టీ 85 పాయింట్లు మైనస్
నిఫ్టీకి 11,017-10,960 వద్ద సపోర్ట్స్
శుక్రవారం యూఎస్ మార్కెట్లు అప్
అదే రోజు యూరోపియన్ మార్కెట్లు పతనం
ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటూ
నేడు (3న) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 85 పాయింట్లు క్షీణించి 11,020 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,105 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్ దిగ్గజాల అండతో శుక్రవారం యూఎస్ మార్కెట్లు 0.5-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. అంతకుముందు యూరోపియన్ మార్కెట్లు 0.5-1.5 శాతం మధ్య వెనకడుగు వేయగా.. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి ఆటుపోట్ల మధ్య కదలవచ్చని భావిస్తున్నారు.
చివరికి నేలచూపులే
ఆగస్ట్ డెరివేటివ్ సిరీస్ తొలి రోజు శుక్రవారం(31న) దేశీ స్టాక్ మార్కెట్లు ఆద్యంతం హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. చివరికి సెన్సెక్స్ 129 పాయింట్లు క్షీణించి 37,607 వద్ద నిలిచింది. నిఫ్టీ 29 పాయింట్లు తక్కువగా 11,073 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 37,898 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,432 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. నిఫ్టీ 11,150-11,027 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,017 పాయింట్ల వద్ద, తదుపరి 10,960 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,140 పాయింట్ల వద్ద, ఆపై 11,207 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,408 పాయింట్ల వద్ద, తదుపరి 21,175 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,840 పాయింట్ల వద్ద, తదుపరి 22,039 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
ఎఫ్పీఐల వెనకడుగు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 959 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 443 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.