నేడు వీక్‌ ఓపెనింగ్‌- ఆపై దారెటు?!

7 Aug, 2020 08:32 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 24 పాయింట్లు మైనస్‌

నిఫ్టీకి 11,133-11,065 వద్ద సపోర్ట్స్‌

గురువారం యూఎస్‌ మార్కెట్లు ప్లస్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు నేలచూపులో

నేడు (7న) దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప వెనకడుగుతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  24  పాయింట్ల నష్టంతో 11,188 వద్ద ట్రేడవుతోంది.  గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్‌ నెల ఫ్యూచర్స్‌ 11,212 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. యాపిల్‌ తదితర దిగ్గజాలు బలపడటంతో గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.7-1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. మధ్యలో ఆటుపోట్లను మినహాయిస్తే గత మూడు రోజుల ట్రేడింగ్‌లో భారీగా లాభపడిన మార్కెట్లలో ట్రేడర్లు కొంతమేర లాభాల స్వీకరణకు దిగవచ్చని.. దీంతో నేడు మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

సెన్సెక్స్‌ @38,000
వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 4 శాతంవద్దే కొనసాగిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 362 పాయింట్లు జంప్‌చేసి 38,025 వద్ద నిలిచింది. తద్వారా తిరిగి 38,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇక నిఫ్టీ 99 పాయింట్లు ఎగసి 11,200 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,221- 37,755 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది. నిఫ్టీ సైతం 11,257- 11,127 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  11,133 పాయింట్ల వద్ద, తదుపరి 11,065 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,262 పాయింట్ల వద్ద, ఆపై 11,324 వద్ద  నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,366 పాయింట్ల వద్ద, తదుపరి 21,090 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,923 పాయింట్ల వద్ద, తదుపరి 22,203 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 637 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 468 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 60 కోట్లు, డీఐఐలు రూ. 426 కోట్ల చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 704 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 666 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. 

మరిన్ని వార్తలు