టాటా గ్రూపునకు ఎస్పీ గ్రూప్ టాటా

23 Sep, 2020 10:46 IST|Sakshi

 కార్పొరేట్ వార్ : 70 ఏళ్ల బంధానికి రాం రాం

టాటా గ్రూపు నుంచి నిష్రమించనున్న షాపూర్జీ పల్లోంజీ  గ్రూపు

ఎస్పీ గ్రూపు వాటాల కొనుగోలుకు టాటాసన్స్ అంగీకారం 

సాక్షి, ముంబై: టాటా సన్స్, సైరస్ మిస్త్రీ మధ్య రగిలిన కార్పొరేట్ వార్ మరింత ముదిరి తమ బంధానికి వీడ్కోలు పలకడానికే టాటా గ్రూపు షాపూర్జీ పల్లొంజీ కంపెనీలు సిద్దమయ్యాయి. దీంతో రెండు కార్పొరేట్ దిగ్గజాల మధ్య ఏడు దశాబ్దాల బంధానికి త్వరలో తరపడనుంది. బిలియనీర్ మిస్త్రీ కుటుంబానికి చెందిన ఎస్పీ గ్రూప్  టాటా సన్స్  వాటాలను విక్రయించి నిధులను సమీకరించాలని భావించింది.  ఈ మేరకు పల్లోంజీ గ్రూపు  సుప్రీంలో అఫడివిట్ దాఖలు చేసింది. అయితే టాటా సన్స్ దీనిపై అభ్యంతరం చెప్పడంతో వాటాలను తాకట్టు పెట్టడం లేదా అమ్మకంపై  స్టేటస్ కో ఇచ్చింది. దీనిపై అక్టోబర్ 28 న తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీం కోరింది. దీంతో అసలు పూర్తిగానే కంపెనీనుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది షాపూర్జీ పల్లొంజీ ప్రమోటర్స్ మిస్త్రీ కుటుంబం. అయితే ఇందుకు న్యాయమైన, సహేతుకమైన పరిష్కారం  కావాలని ప్రకటించింది. పల్లోంజీ వాటా కొనుగోలు చేస్తామని టాటా సన్స్  ప్రకటించిన కొన్ని గంటల్లోనే తాము టాటా గ్రూపునుంచి బయటకు రావాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. 

టాటా సన్స్ లో లిస్టెడ్ కంపెనీలు నష్టాలు, ఆయా కంపెనీల్లో షేర్ హోల్డర్స్ ప్రయోజనాలు కాపాడేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్పీ గ్రూపు తెలిపింది. టాటా గ్రూప్ కంపెనీలలో గత మూడేళ్లలో సుమారు 11,000 కోట్లుకు పెరిగాయని పేర్కొంది. అయితే టాటా గ్రూపు దీన్ని అడ్డుకోవడాన్ని కంపెనీ తప్పుబట్టింది. 70 ఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య నమ్మకం, స్నేహం, పరస్పర అవగాహనతో వ్యాపారబంధం కొనసాగినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కావడం లేదని తెలిపింది. బరువైన మనసుతో బయటకు రావాల్సి వస్తుందని షాపూర్జీ పల్లోంజీ వ్యాఖ్యానించింది. దేశంలోనే అతిపెద్ద గ్రూపు టాటా సన్స్ లో మిస్త్రీ కుటుంబం 18.37 శాతం వాటాతో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఉంది.  తన వాటాకు 1.78 ట్రిలియన్ల  రూపాయలు ఎస్పీ గ్రూప్ అంచనా వేస్తోంది. అయితే  ఎస్పీ వాటాలను ఎంతకు కొనుగోలు చేసేదీ, సమయ పరిధి టాటా ప్రకటించలేదు. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయనీ, ఇది కీలక అడుగు అని సీనియర్ కార్పొరేట్ న్యాయవాది ఎస్ పి రనినా అన్నారు.

కాగా అక్టోబర్, 2016లో టాటా సన్స్ ఛైర్మన్ పదవినుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తరువాత వివాదం రగిలింది. టాటా గ్రూప్, మిస్త్రీల మధ్య న్యాయ పోరు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా మిస్త్రీ కుటుంబం నిధులు సేకరించే పనిలో ఉంది. అంతేకాకుండా తన లిస్టెడ్ కంపెనీకి ఎస్ అండ్ డబ్ల్యూ సోలార్ నుంచి రుణాలపై బకాయి పడింది. ఈ నేపథ్యంలోనే  వ్యక్తిగత ఆస్తుల అమ్మకానికి సిద్ధపడుతోంది. 

మరిన్ని వార్తలు