నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

6 Aug, 2021 16:01 IST|Sakshi

ముంబై: స్టాక్‌మార్కెట్‌ అస్థిరతకు లోనైంది. రోజంగా లాభనష్టాల మధ్య ఊగిసలాడింది, చివరకు ఈవారాన్ని నష్టాలతో ముగించింది. గత మూడు రోజులుగా రికార్డు స్థాయిలో లాభాలు అందించిన మార్కెట్‌ శుక్రవారం నష్టాలతో ముగిసింది. ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంట్‌ కనిపిస్తున్నా.. రిపోరేటు, రివర్స్‌ రిపోరేటు విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేసిన ప్రకటన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.

బీఎస్‌సీ సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 54,492 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే స్వల్ప నష్టాలపాలైన వెంటనే కోలుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటన వెలువడిన గంట వ్యవధిలోనే రెండు వందలకు పైగా పాయింట్లు నష్టపోయి 54,210 పాయింట్లకు పడిపోయింది, ఆ తర్వాత క్రమంగా కోలుకుంది. చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి 215 పాయింట్లు నష్టపోయి 54,277 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం ఒడిదుడుకులకు లోనైంది. చివరకు 56 పాయింట్లు నష్టపోయి16,238 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

ఫ్ఫ్యూచర్‌ గ్రూపు వివాదంలో రిలయన్స్‌కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు  భారీగా నష్టపోయాయి. ఆ తర్వాత ఆల్ట్రాటెక్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు షేర్లు లాభాలు పొందాయి. ఇక ఈ రోజు లాభపడిన షేర్లలో టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతి సుజూకి ఇండియాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు