రోజుకు 3 కోట్లు విరాళాలు, టాప్‌లో ఎవరు? అంబానీ, అదానీ ఎక్కడ?

20 Oct, 2022 15:36 IST|Sakshi

సాక్షి, ముంబై: ఎడెల్ గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో బిలియనీర్ పారిశ్రామికవేత్త, పరోపకారి హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు,  77 ఏళ్ల శివ్ నాడార్  టాప్‌ ప్లేస్‌ను ఆక్రమించారు.. రోజుకు రూ. 3 కోట్లు విరాళంగా  ఇచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. 2022 సంవత్సరానికి గాను ఎడెల్‌ గివ్‌ హురున్‌ ఇండియా విడుదల చేసిన తాజా లిస్ట్‌లో రూ. 1161 కోట్ల వార్షిక విరాళంతో దేశీయ అత్యంత ఉదారమైన వ్యక్తిగా శివ నాడార్ నిలిచారు.

484 కోట్ల రూపాయల వార్షిక విరాళాలతో విప్రో 77 ఏళ్ల అజీమ్ ప్రేమ్‌జీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. దాతృత్వంలో ఇప్పటివరకు ఈ జాబితాలో టాప్‌లో ఉన్న అజీమ్ ప్రేమ్‌జీ  విరాళాలు  95 శాతం తగ్గిపోవడంతో రెండో స్థానానికి పడిపోయారు. ఆసియా, భారతదేశపు అత్యంత సంపన్నుడు, గౌతమ్ అదానీ విరాళాలు 46 శాతం పెరగడంతో ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచారు.  గత మూడేళ్లలో రూ.400 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. ఇక రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్‌ అంబానీ 1446 కోట్ల రూపాయలతో  ఈ జాబితాలో మూడవ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 

2022 ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో  భారతదేశంలో 15 మంది దాతలు రూ. 100 కోట్లకు పైగా వార్షిక విరాళాలివ్వగా, 20 మంది  రూ. 50 కోట్లకు పైగా విరాళాలను అందించగా,   20 కోట్లకు పైగా విరాళాలిచ్చిన వారి సంఖ్య 43 మంది అని నివేదిక తెలిపింది. ఇంకా 142 కోట్ల రూపాయల విరాళం అందించిన లార్సెన్ అండ్ టూబ్రో గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్, దేశీయ అత్యంత ఉదారమైన ప్రొఫెషనల్ మేనేజర్. జెరోధా వ్యవస్థాపకులు నితిన్ ,నిఖిల్ కామత్ తమ విరాళాన్ని 300శాతం పెంచి రూ.100 కోట్లకు చేరుకున్నారు.  వీరితోపాటు  మైండ్‌ట్రీ సహ వ్యవస్థాపకుడు సుబ్రొతో బాగ్చి,  ఎన్‌ఎస్ పార్థసారథి జాబితాలో ఒక్కొక్కరు రూ. 213 కోట్ల విరాళాలత  టాప్ 10లోకి ప్రవేశించడం  విశేషం.
 

మరిన్ని వార్తలు