90 గంటల పని:ఎయిరిండియా పైలట్ల సంచలన ఆరోపణలు, ప్రయాణీకుల ప్రాణాలు!?

15 Dec, 2022 21:49 IST|Sakshi

సాక్షి, ముంబై: టాటా గ్రూప్ సొంతమైన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా పైలట్లు సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ పనిగంటలతో పాటు,హెల్త్‌ లీవ్‌లను నిరాకరిస్తోందని ఎయిరిండియా పైలట్‌ బాడీ, ఇండియన్‌ కమర్షియల్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. తాజా పరిణామంతో ప్రయాణీకుల భద్రత ప్రశ్నలను లేవనెత్తుతోంది. 

సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం పైలట్‌లు నెలకు 70 గంటలకు బదులుగా అన్ని విమానాలలో నెలకు 90 గంటలకు పైగా ప్రయాణించారని(ఫైయింగ్‌ అవర్స్‌)  ఐపీజీ-ఐసీపీఏ వాదించింది. అలాగే ఎయిరిండియా యాజమాన్యం పైలట్‌లకు లీవ్‌లను నిరాకరిస్తోందని  ఒక్కోసారి  రద్దు చేస్తోందని తద్వారా చాలామంది పైలట్లు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించింది. అంతేకాదు సెలవులు పొందిన లేదా శిక్షణ పొందిన నెలల్లో వేతన కోతలతో వేధిస్తున్నారని పైలట్లు ఆరోపించారు. ఇకపై దీన్ని సహించలేమని, తమ జీవన నాణ్యత, పని-జీవిత సమతుల్యత, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని త్యాగం చేయలేమని పేర్కొన్నారు. (రిలయన్స్‌ మరో సంచలనం: గుజరాత్‌లో షురూ)

కోవిడ్ తరువాత వేతనాల్లో కోత పెట్టిన సంస్థ ఇపుడు పూర్వ వేతనాలను చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్ 777 ఫ్లీట్‌ల కోసం ఎక్స్-ప్యాట్ పైలట్‌లను ప్రస్తుత దీర్ఘకాలిక పైలట్‌ల కంటే 80 శాతం ఎక్కువ వేతనంతో రిక్రూట్ చేస్తోందనీ భారతీయ పైలట్లపై  చూపిస్తున్న ఈ వివక్షను  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఐపీజీ-ఐసీపీఏ తెలిపింది.  కాగా సిబ్బంది కొరత నివేదికలను ఎయిరిండియా ఖండించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుసుకుంది. మరి తాజా ఆరోపణలపై  ఎయిరిండియా సంస్థ ఎలా స్పందిస్తుందో  చూడాలి. (బర్సో రే మేఘా మేఘా అంటున్న ఇన్ఫోసిస్‌ సుధామూర్తి: వీడియో చూస్తే ఫిదా)

మరిన్ని వార్తలు