ఎస్‌వీబీని ముంచేసి..భార్యతో ఎంచక్కా చెక్కేసిన సీఈవో, లగ్జరీ ఇంట్లో!

17 Mar, 2023 20:01 IST|Sakshi

అమెరికా బ్యాకింగ్‌ రంగంలో సంక్షోభం నెలకొంది. రెండ్రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు మూతపడ్డాయి. ముందుగా సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) చేతులెత్తేస్తే..ఆ తర్వాత సిగ్నేచర్‌ బ్యాంక్‌ చాపచుట్టేసింది. దీంతో వేలాది కంపెనీలు, లక్షల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే ఎస్‌వీబీ బ్యాంక్‌ మూసివేతతో ఆ సంస్థ మాజీ సీఈవో గ్రెగ్ బెకర్ భార్యతో కలిసి పారిపోయాడు. ప్రస్తుతం ఓ దీవిలో తన భార్యతో ఎంజాయి చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

భార్యతో కలిసి పారిపోయాడు 
న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం ప్రకారం..ఎస్‌వీబీ దివాళాతో గ్రెగ్‌ బెక్‌, తన భార్య మార్లిన్ బటిస్టాతో కలిసి హవాయీ ఐస్‌లాండ్ దీవిలోని మాయి అనే ప్రాంత 3.1 బిలియ్‌ డాలర్ల విలువైన టౌన్‌ హౌస్‌కి పారిపోయాడు. గ్రెగ్‌ బెక్‌ దంపతులు సోమవారం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి హవాయికి ఈ జంట ఫస్ట్ క్లాస్ విమానంలో హవాయీ వెళ్లారు. అక్కడ లిమో(limo ride) రైడ్‌ చేసినట్లు, లహైన (Lahaina) ప్రాంతంలో సేద తీరే ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. 


  
ఎస్‌వీబీ దివాళాకు రెండు వారాల ముందు
ఫెడరల్ రెగ్యులేటర్లు ఎస్‌వీబీని మూసివేయడానికి రెండు వారాల ముందు 3 మిలియన్ డాలర్ల విలువైన తన షేర్లను విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న సమయంలో భార్యతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలు ప్రత్యక్షమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

లోన్‌ అధికారి నుంచి సీఈవోగా 
ఎస్‌వీబీ వెబ్‌సైట్ ప్రకారం..గ్రెగ్‌ బెక్‌ మూడు దశాబ్దాల క్రితం అంటే 1993లో  సిలికాన్ వ్యాలీ బ్యాంకులో లోన్‌ అధికారిగా చేరారు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ ఇన్నోవేషన్ సెక్టార్‌లో సేవలందించే గ్లోబల్ కమర్షియల్ బ్యాంకింగ్, వెంచర్ క్యాపిటల్, క్రెడిట్ ఇన్వెస్టింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ విభాగాల్లో కీలక పాత్రపోషించారు.      

నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నించి
అమెరికా శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌ ఇది. ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ తన పోర్ట్‌ఫోలియోలో నష్టాలను పూడ్చుకోవడం కోసం, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్‌ డాలర్ల సెక్యూరిటీలను, 2.25 బిలియన్‌ డాలర్ల వాటా విక్రయించేందుకు సిద్ధమైంది. అయితే ఊహించని విధంగా బ్యాంక్‌ను మూసేసింది.

బ్యాంక్‌ సంక్షోభంతో ఎస్‌వీబీలో డిపాజిట్లు ఉన్న దాదాపు 10వేల టెక్నాలజీ కంపెనీలు..వచ్చే 30 రోజుల్లో తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యే అవకాశం నెలకొంది. లక్షకు పైగా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

మరిన్ని వార్తలు