‘ఎపాక్‌’ ఆర్థిక సంస్థలపై ప్రభావం తక్కువే..

15 Mar, 2023 07:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్‌ ప్రాంత దేశాలకు చెందిన (ఎపాక్‌) చాలా మటుకు ఆర్థిక సంస్థలకు మూతబడిన అమెరికన్‌ బ్యాంకుల్లో పెట్టుబడులు పెద్దగా లేవని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సరీ్వస్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల మూసివేత ప్రభావం వాటిపై అంతగా ఉండబోదని పేర్కొంది. డిపాజిటర్లు విత్‌డ్రాయల్స్‌కు ఎగబడటంతో అమెరికాలో రెండు రోజుల వ్యవధిలోనే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ), సిగ్నేచర్‌ బ్యాంకు మూతబడిన నేపథ్యంలో మూడీస్‌ విశ్లేషణ ప్రాధాన్యం సంతరించుకుంది.

‘మూసేసిన అమెరికా బ్యాంకుల్లో చాలా మటుకు ఎపాక్‌ సంస్థల నిధులు ఏమీ లేవు. ఏవో అరకొర సంస్థలకు ఉన్నా అవి భారీ స్థాయిలో లేవు. మొత్తం మీద చాలా మటుకు సంస్థలకు ఎస్‌వీబీపరంగా భారీ నష్టాలేమీ వాటిల్లే అవకాశం లేదు‘ అని మూడీస్‌ పేర్కొంది. ఎపాక్‌లోని రేటెడ్‌ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, వాటి దగ్గర తగినంత స్థాయిలో నగదు లభ్యత ఉందని తెలిపింది. కేవలం టెక్నాలజీ రంగానికే పరిమితం కాకుండా వాటి దగ్గర వివిధ రంగాల డిపాజిట్లు ఉన్నాయని పేర్కొంది.  

ఆర్థిక శాఖ దృష్టికి స్టార్టప్‌ల కష్టాలు.. 
ఎస్‌వీబీ ప్రభావిత దేశీ స్టార్టప్‌ల సమస్యలను ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. సంక్షోభం నుంచి బైటపడేందుకు వాటికి కావాల్సిన సహాయం అందించాలని కోరనున్నట్లు వివరించారు. మంగళవారం అంకుర సంస్థలతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.  డిపాజిట్లు మొత్తం తిరిగి వస్తాయంటూ స్టార్టప్‌లు, వెంచర్‌ క్యాపిటలిస్టులకు అమెరికా ప్రభుత్వ వర్గాలు హామీ ఇస్తున్నప్పటికీ ఇందుకోసం ఎంత సమయం పడుతుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదని మంత్రి తెలిపారు.

ఎస్‌వీబీ మాతృసంస్థపై షేర్‌హోల్డర్ల దావా 
మూతబడిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ)పై షేర్‌హోల్డర్లు కోర్టును ఆశ్రయించారు. ఎస్‌వీబీ మాతృ సంస్థ ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్, సీఈవో గ్రెగ్‌ బెకర్, సీఎఫ్‌వో డేనియల్‌ బెక్‌పై కాలిఫోరి్నయాలోని న్యాయ స్థానంలో క్లాస్‌ యాక్షన్‌ దావా వేశారు. వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల వ్యాపారానికి పొంచి ఉన్న రిస్క్‌లను వెల్లడించడంలో కంపెనీ విఫలమైందని పిటీషన్‌లో పేర్కొన్నారు. 2021 జూన్‌ 16–2023 మార్చి 10 మధ్య ఇన్వెస్ట్‌ చేసిన వారికి పరిహారం ఇప్పించాలని కోరారు.

మరిన్ని వార్తలు