Realme: ఫెస్టివల్‌ సీజన్‌.. టార్గెట్‌ బిగ్‌సేల్స్‌!

10 Sep, 2021 10:52 IST|Sakshi

న్యూఢిల్లీ: పండగ సీజన్‌గా పేర్కొనే సెప్టెంబరు–అక్టోబర్‌లో 60 లక్షల పైచిలుకు స్మార్ట్‌ఫోన్ల విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రియల్‌మీ ఇండియా, యూరప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మాధవ్‌ సేథ్‌ వెల్లడించారు. ట్యాబ్లెట్‌ పీసీల్లో మరిన్ని మోడళ్లను తేనున్నట్టు వివరించారు. ల్యాప్‌టాప్స్‌ తయారీ కోసం మూడు కంపెనీలతో చర్చిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి దేశంలో వీటి తయారీ ప్రారంభం అవుతుందన్నారు. ట్యాబ్లెట్‌ పీసీలు సైతం దేశీయంగా ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. 2020లో భారత్‌లో 1.9 కోట్ల యూనిట్ల రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి.  

చిప్‌సెట్ల ఎఫెక్ట్‌ లేదు
ప్రపంచవ్యాప్తంగా చిప్‌సెట్‌ కొరత నెలకొన్నా... దాని ప్రభావం ఈ పండుగల సీజన్లో తమ కంపెనీపై ఉండబోదని రియల్‌మీ స్పష్టం చేసింది. భారత్‌లో తమ కంపెనీ ఈ ఏడాది 2.4–2.7 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలను నమోదు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాదికి సైతం సరిపడ చిప్‌సెట్లను కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్టు రియల్‌మీ ఇండియా, యూరప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మాధవ్‌ సేథ్‌ వెల్లడించారు. భారత మార్కెట్‌ విషయంలో చిప్‌సెట్‌ కొరత రాకుండా ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం చేశారు. 

రియల్‌మీ ప్యాడ్‌.. 
రూ.13,999 ధరలో రియల్‌మీ ప్యాడ్‌ను కంపెనీ గురువారం భారత్‌లో విడుదల చేసింది. మీడియాటెక్‌ హీలియో జీ80 గేమింగ్‌ ప్రాసెసర్, 10.4 అంగుళాల స్క్రీన్, 7100 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా పొందుపరిచారు. 3/4 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే రియల్‌మీ 8ఎస్‌ 5జీ, రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్లను సైతం ప్రవేశపెట్టింది. వీటి  ప్రారంభ ధరలు రూ.13,999 నుంచి మొదలవుతున్నాయి. 

చదవండి: వన్‌ప్లస్‌ నుంచి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌..!

మరిన్ని వార్తలు